Jangaon: ప్రజావాణిలో అర్జీల సునామీ.. ఒకే రోజు 532 దరఖాస్తులు స్వీకరణ!

Jangaon: జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఒకే రోజు 532 దరఖాస్తులు వచ్చాయి.

MD AHMAD PASHA, JANGAON
Published on: 15 Jun 2026 4:59 PM IST
Jangaon
X

Jangaon: ప్రజావాణిలో అర్జీల సునామీ.. ఒకే రోజు 532 దరఖాస్తులు స్వీకరణ!

జనగామ జిల్లా: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వినతిపత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చే ప్రజల పట్ల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం అని స్పష్టం చేశారు. అందిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా సత్వరమే పరిష్కార మార్గాలను చూపాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను వర్గీకరించి, వాటిని పరిష్కరించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 532 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి.

బండనాగారం గ్రామం, బచ్చన్నపేట మండలానికి చెందిన యు. రాజు బండనాగారం గ్రామం నుంచి లద్నుర్ గ్రామం వరకు ఉన్న దారిని సర్వే నంబర్ 52లో గల రైతులు మూసివేశారని, ఆ దారిని పునరుద్ధరించాలని మనవి చేస్తూ ద‌రఖాస్తు చేసుకున్నారు.

జనగామకు చెందిన బచ్చు బాల నారాయణ, ఇంటి నిర్మాణం కోసం మొరం గురించి అనుమతి కొరకు మీ-సేవాలో దరఖాస్తు చేసుకున్నారని, త్వరగా అనుమతి ఇవ్వాలని ద‌ర‌ఖాస్తు చేసియున్నారు. రఘునాథపల్లి మండలంలోని కోమల్ల గ్రామం కర్ణాలకుంట చెరువు కట్టపై ముళ్ల చెట్లను తొలగించి, గ్రామ స్మశానవాటిక స్థలాన్ని పరిరక్షించాలని గ్రామస్థులు ప్రార్థిస్తూ ఆర్జీ ద్వారా కోరారు.

బండనాగారం గ్రామం బచ్చన్నపేట మండలానికి చెందిన డి. సురేష్, తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల గేటుకు ఆనుకొని మంగళి డబ్బాను నిర్మించారని, మొత్తం బ్లేడ్లు వెంట్రుకలు పాఠశాల ఆవరణలోకి కొట్టుకు వస్తున్నాయని, విద్యార్థులు భోజనం చేసే దాంట్లో అలాగే వండే ఆహార పదార్థాలలో పడుతున్నాయని, ఆ డబ్బాను అక్కడ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ విన‌తిప‌త్రం స‌మ‌ర్పించ‌నైన‌ది.

బండనాగారం గ్రామం, బచ్చన్నపేట మండలానికి చెందిన ఏ. ఆశా రాణి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదని తనకు తెల్ల రేషన్ కార్డు ఉందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని దరఖాస్తును స‌మ‌ర్పించినారు. ఈ ప్ర‌జావాణిలో జెడ్పీ సీఈవో రంగా రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story