Hanamkonda: నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కేంద్రాలకు హాజరై ధ్రువపత్రాలు సమర్పించాలి: అదనపు కలెక్టర్ ఎన్. రవి
Hanamkonda: హన్మకొండ కలెక్టరేట్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ ఎన్. రవి సమావేశం.
Hanamkonda: నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణ కేంద్రాలకు హాజరై ధ్రువపత్రాలు సమర్పించాలి: అదనపు కలెక్టర్ ఎన్. రవి
హన్మకొండ: ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలోని ఓటర్లు నిర్దేశిత తేదీలో సంబంధిత విచారణ కేంద్రాలకు హాజరై ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాలు సమర్పించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతోఅదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా అనామలీస్ (లోపాలు/అసమానతలు), నో మ్యాపింగ్ కు సంబంధించి నోటీసులు అందుకున్న ఓటర్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన విచారణ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు.
నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణ ఏ విధంగా నిర్వహిస్తారు, ఏఈఆర్ఓలకు ఏయే ధ్రువపత్రాలు సమర్పించాలి, విచారణ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు ఏమిటి అనే అంశాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరు కావాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు నోటీసులో పేర్కొన్న ప్రదేశం, నిర్దేశిత తేదీ, సమయంలో సంబంధిత విచారణ కేంద్రానికి హాజరై ఏఈఆర్ఓకు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు.
నిర్దేశిత తేదీన విచారణకు హాజరుకాని వారికి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తదుపరి నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొదటి దశలో నోటీసులు జారీ చేసిన వాటిపై విచారణ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న విచారణలు, నోటీసుల జారీ, పత్రాల సమర్పణ తదితర అంశాలపై అధికారులు ఇచ్చిన వివరణ పట్ల సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఈఆర్వో/ హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అమరేందర్ రెడ్డి, ఎండి. నేహాల్, శ్యామ్ సుందర్, ప్రవీణ్ కుమార్, రజనీకాంత్, సయ్యద్ ఫైజుల్లా, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.




