Thorrur: తొర్రూరు మార్కెట్‌లో ఆయిల్‌పామ్ రైతుల సమస్యలు విన్న ఎర్రబెల్లి!

Thorrur: గోపాలగిరి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 30 Aug 2026 6:55 PM IST
Thorrur
X

Thorrur: తొర్రూరు మార్కెట్‌లో ఆయిల్‌పామ్ రైతుల సమస్యలు విన్న ఎర్రబెల్లి!

Thorrur: గోపాలగిరిలో మంజూరైన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టి తొర్రూరు పరిసర ప్రాంతాల వేలాది మంది ఆయిల్‌పామ్ రైతులకు మేలు చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. తొర్రూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో అమ్మకానికి తీసుకొచ్చిన ఆయిల్‌పామ్ గెలలను పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గోపాలగిరిలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత రైతులకు వరంగా మారుతుందని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు మంజూరు లభించిందని, అందులో సిద్దిపేటతో పాటు గోపాలగిరి కూడా ఉందన్నారు. తొర్రూరు ప్రాంతానికి మంజూరైన ఫ్యాక్టరీకి సుమారు రూ.100 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ నిర్మాణం శంకుస్థాపనకే పరిమితమైందని ఆరోపించారు.

ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఆయిల్‌పామ్ గెలలను దూర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం లేకుండా రైతులకు స్థానికంగానే మార్కెటింగ్ సౌకర్యం లభిస్తుందని అన్నారు. అధికారుల సూచనల ప్రకారం సాగు చేస్తే ఎకరాకు సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఫ్యాక్టరీ లేకపోవడంతో రైతులు తమ పంటను విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

శంకుస్థాపన చేసి ఏళ్లయినా నిర్మాణం ఎందుకు పూర్తి చేయడం లేదు?

గోపాలగిరిలో ఫ్యాక్టరీ నిర్మాణానికి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో రైతులకు సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి తొర్రూరు పరిసర ప్రాంతాల ఆయిల్‌పామ్ రైతులకు మార్కెటింగ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.

అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయిల్‌పామ్ నర్సరీల్లో నాసిరకం మొక్కలు, నాటేందుకు అనువైన వయసు దాటిన మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారని, నాణ్యమైన మొక్కలను సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలని అన్నారు.

1000 రోజులు గడిచినా హామీలు అమలు కాలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1000 రోజులు అవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అనేకం అమలుకు నోచుకోలేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గోపాలగిరి ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story