Bhupalpally: పంట పొలంలో బాంబు పేలుడు.. మహిళా కూలీకి తీవ్ర గాయాలు!
Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెపల్లి గ్రామంలో వ్యవసాయ పొలంలో బాంబు పేలింది.
Bhupalpally: పంట పొలంలో బాంబు పేలుడు.. మహిళా కూలీకి తీవ్ర గాయాలు!
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గూడెపల్లి గ్రామంలో పొలంలో బాంబు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చేనులో నలుసు ఏరుతున్న మహిళా కూలీ కొడవలితో భూమిలో ఉన్న వస్తువును కదిలించడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గుండె స్వర్ణలత (34) ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే పరకాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గూడెపల్లికి చెందిన మోరె రాజు తన 20 గుంటల భూమిలో మిరప తోట సాగు కోసం ఇద్దరు మహిళా కూలీలతో పనులు చేయిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. భూమిలో బాంబు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయి.
గతంలో ఈ ప్రాంతంలో నక్సలైట్ల సంచారం ఉన్న నేపథ్యంలో అప్పట్లో పాతిపెట్టిన బాంబు మిగిలిపోయిందా? లేక భూ యజమానిని లక్ష్యంగా చేసుకుని ఎవరైనా కుట్రపూరితంగా బాంబు పెట్టారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడు ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.




