Kurupam: కురుపాం వారపు సంతలో పోలీసుల అవగాహన కార్యక్రమం
Kurupam: కురుపాం వారపు సంతలో రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ఎస్సై నారాయణరావు అవగాహన. హెల్మెట్ ధరించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచన.
Kurupam: కురుపాం వారపు సంతలో పోలీసుల అవగాహన కార్యక్రమం
కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని వారపు సంతలో గురువారం కురుపాం ఎస్సై నారాయణ రావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సైబర్ భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల నివారణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కురుపాం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి. నారాయణరావు మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. అలాగే ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు.
మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, మాదకద్రవ్యాలను వినియోగించినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలపై జరిగే వేధింపులు, గృహహింస, ఇతర నేరాల విషయంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరుతూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ పి. నారాయణరావు విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు, వ్యాపారులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




