Kurupam: గడపగడపకు పోలీస్ భరోసా.. కురుపాంలో ‘ఇంటింటికి మన్యం పోలీస్’ ప్రారంభం!

Kurupam: పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కురుపాం మండలం రస్తాకుంటుబాయిలో ‘ఇంటింటికి మన్యం పోలీస్’ కార్యక్రమం ప్రారంభమైంది.

V.SESHU	, KURUPAM
Published on: 17 Aug 2026 7:30 PM IST
Kurupam
X

Kurupam: గడపగడపకు పోలీస్ భరోసా.. కురుపాంలో ‘ఇంటింటికి మన్యం పోలీస్’ ప్రారంభం!

కురుపాం, ఆగస్టు 17: ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలను అందించడంతో పాటు నేరాల నివారణపై అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు శాఖ చేపట్టిన “ఇంటింటికి మన్యం పోలీస్” కార్యక్రమానికి కురుపాం మండలంలో శ్రీకారం చుట్టారు. కురుపాం పోలీస్ స్టేషన్ పరిధిలోని రస్తాకుంటుబాయి గ్రామంలో సోమవారం ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి.హరి ఆధ్వర్యంలో, కురుపాం ఎస్ఐ పి.నారాయణరావు సమక్షంలో పోలీసు సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. గ్రామస్థుల సమస్యలను తెలుసుకుంటూ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని వివరించారు.

ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, గృహహింస, ఇతర నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, వారి భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్‌లైన్ లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాల విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఏవైనా మోసపూరిత ఘటనలు ఎదురైతే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112 సేవలను ఎలా వినియోగించుకోవాలో ప్రజలకు వివరించారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంటికి “ఇంటింటికి మన్యం పోలీస్” స్టిక్కర్లను అతికించి పోలీసు సంప్రదింపు వివరాలను అందుబాటులో ఉంచారు.

ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను ఎటువంటి సంకోచం లేకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, నేరాల నియంత్రణలో పోలీసు శాఖకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కురుపాం మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story