Parvathipuram: శివాలయం వద్ద గజరాజుల సందడి.. తొండం ఎత్తి శివునికి నమస్కారం!
Parvathipuram: జియ్యమ్మవలస మండలం పరజపాడు శివాలయం వద్ద ఏనుగుల గుంపు సందడి. స్వామివారికి తొండాలు ఎత్తి దండం పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్.
Parvathipuram: శివాలయం వద్ద గజరాజుల సందడి.. తొండం ఎత్తి శివునికి నమస్కారం!
పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల సంచారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జియ్యమ్మవలస మండలం పరజపాడు గ్రామ సమీపంలోని పొలిమేర ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు స్థానిక శివాలయం వద్ద కొద్దిసేపు ఆగి ఆలయ పరిసరాల్లో తిరిగింది.అనంతరం ఏనుగులు తొండాలు ఎత్తి శివునికి నమస్కరించాయి..ఈ దృశ్యం అక్కడున్న గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆలయం ఎదుటకు చేరుకున్న గజరాజులు కొంతసేపు అక్కడే నిలిచి ఉండటంతో, అవి శివాలయాన్ని పరిశీలిస్తున్నట్లుగా కనిపించాయని స్థానికులు తెలిపారు. ఈ అరుదైన దృశ్యాలను పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి.
ఇటీవల విజయనగరం జిల్లా నుంచి తిరిగి మన్యం ప్రాంతంలోకి ప్రవేశించిన ఈ ఏనుగుల గుంపు పలు గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. గజరాజుల కదలికలతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉంటూనే ఆసక్తిగా వాటిని గమనిస్తున్నారు.
ఏనుగులు గ్రామాల వైపు రాకుండా అటవీశాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. గజరాజుల సంచారంపై అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి అవసరమైన జాగ్రత్తలు సూచించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.




