Gajuwaka: ఓటరు జాబితాలో అప్రమత్తంగా ఉండండి: గాజువాక వైసీపీ నేత తిప్పల శ్రీనివాస!
Gajuwaka: గాజువాక నియోజకవర్గంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ సమీక్షా సమావేశం.
Gajuwaka: ఓటరు జాబితాలో అప్రమత్తంగా ఉండండి: గాజువాక వైసీపీ నేత తిప్పల శ్రీనివాస!
Gajuwaka: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా వెన్నెముక వంటిదని,అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఓటరు జాబితాలో పేర్లు తొలగించబడకుండా అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని తెలిపారు. ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి కమిటీలు, వార్డు అధ్యక్షులు,ముఖ్య నాయకులు తమ తమ పరిధిలో ఓటరు జాబితాలను పరిశీలించి కొత్తగా 18 సం||నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయడానికి ప్రత్యేకచర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఓటర్ల వివరాల్లో మార్పులు,చిరునామా సవరణలు,ఇతర సాంకేతిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని,ప్రజల ఓటు హక్కును కాపాడటం ప్రతి రాజకీయ కార్యకర్త బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఇంటికి చేరుకుని ఓటరు జాబితాపై అవగాహన కల్పించాలని,అవసరమైన దరఖాస్తులు సకాలంలో సమర్పించేలా ప్రజలకు సహకరించాలని కోరారు.
రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణ, బూత్ వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఓటరు నమోదు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు మరియు వాటి పరిష్కారాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతం కావడం ఎంతో కీలకమని తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి అన్నారు.
ఈ సమావేశంలో భూపతి రాజు, మారుకూడి పరదేశి, ధర్మాల శ్రీనివాసరావ వార్డుమాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు,వార్డు అధ్యక్షులు, వార్డు పరిశీలకులు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, వార్డు అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




