Anakapalli: కన్నకొడుకు అంత్యక్రియలకు నిందితుడికి అనుమతి

Anakapalli: రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ప్రత్యేక చొరవతో విశాఖ సెంట్రల్ జైలు గంజాయి కేస్ నిందితుడికి ఒకరోజు అత్యవసర పరోల్ మంజూరు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 3 Jun 2026 1:57 PM IST
Anakapalli
X

Anakapalli: కన్నకొడుకు అంత్యక్రియలకు నిందితుడికి అనుమతి

అనకాపల్లి: చట్టాన్ని అమలు చేయడంలోనే కాదు, ఆపదలో ఉన్నప్పుడు మానవత్వాన్ని చాటడంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని అనకాపల్లి జిల్లా పోలీసులు మరోసారి నిరూపించారు. పిట్ ఎన్‌డిపిఎస్ (PIT NDPS) చట్టం కింద విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు పెచ్చేటి రాజు (అలియాస్ మహాలక్ష్మినాయుడు)కు తన కుమారుని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మానవతా దృక్పథంతో ఒకరోజు తాత్కాలిక బెయిల్ (పరోల్) మంజూరు చేయించడంలో అనకాపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం చూపిన చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఘటన నేపథ్యం:

అనకాపల్లి జిల్లా, వి.మాడుగుల మండలం, జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉంటూ, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి 12న పిట్ ఎన్‌డిపిఎస్ చట్టం కింద అరెస్ట్ అయి విశాఖపట్నం సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

కాగా, గత మే 31వ తేదీన జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో రాజు పెద్ద కుమారుడు పెచ్చేటి సాయి కిరణ్ (17) అక్కడికక్కడే మరణించాడు. మూడేళ్ల క్రితమే రాజు చిన్న కుమారుడు జితేంద్ర అనారోగ్యంతో మరణించగా, ఇప్పుడు పెద్ద కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భర్త జైలులో ఉండి, ఇద్దరు కొడుకులు దూరమవడంతో రాజు భార్య లక్ష్మి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది.

పోలీసుల తక్షణ స్పందన – మానవత్వం:

కన్నకొడుకు చివరి చూపుకైనా తండ్రిని తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారిని ఆశ్రయించగా , పరిస్థితి యొక్క తీవ్రతను, కుటుంబంలోని విషాదాన్ని గమనించిన ఎస్పీ గారు వెంటనే స్పందించి, హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

ఎస్పీ గారి ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (రెవెన్యూ మరియు ఎక్సైజ్ శాఖ) జూన్ 2వ తేదీన అత్యవసరంగా జీవో జారీ చేస్తూ, నిందితుడు పెచ్చేటి రాజుకు ఒకరోజు కారాగారం నుండి తాత్కాలిక విడుదల (Permission for one-day temporary release) మంజూరు చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, తగిన పోలీస్ భద్రత (Escort) నడుమ పెచ్చేటి రాజు ఈరోజు (జూన్ 3న) జంపెన గ్రామానికి చేరుకుని, తన కుమారుడు సాయి కిరణ్ పిండ ప్రధాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కష్టసమయంలో చట్టపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ, కేవలం మానవతా దృక్పథంతో స్పందించి, కన్నకొడుకు కి పిండ ప్రధానం చేసే అవకాశం కల్పించిన అనకాపల్లి జిల్లా పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story