Narsipatnam: సింగిల్ విండో విధానంలో గణేష్ ఉత్సవాల అనుమతులు!

Narsipatnam: గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో ద్వారా ఉచిత అనుమతులు పొందాలని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి.. డిజెలకు అనుమతి లేదని హెచ్చరిక.

R. A. Naidu, Narsipatnam
Published on: 11 Sept 2026 12:22 PM IST
Narsipatnam
X

Narsipatnam: సింగిల్ విండో విధానంలో గణేష్ ఉత్సవాల అనుమతులు!

Narsipatnam: ఉత్సవ కమిటీ నిర్వాహకులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సింగిల్ విండో ఈ-పోర్టల్ ద్వారా అనుమతులు పొందే సౌకర్యాన్ని కల్పించింది. ఈ విధానం ద్వారా గణేష్ మండపాల ఏర్పాటు, లౌడ్‌స్పీకర్లు, ఊరేగింపు మరియు నిమజ్జనానికి సంబంధించిన అనుమతులను ఒకే చోట సులభంగా పొందవచ్చు.

గణేష్ మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు గమనించాలి.

ఆన్‌లైన్‌లో అనుమతి పొందే విధానం

ఉత్సవ కమిటీ నిర్వాహకులు కమిటీగా ఏర్పడి ganeshutsav.net వెబ్‌సైట్‌ను సందర్శించి “New Application” పై క్లిక్ చేయాలి. అనంతరం మొబైల్ నంబర్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అడిగిన అన్ని వివరాలను సక్రమంగా నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలి.

అనుమతి మంజూరైన తర్వాత Application Status ద్వారా మొబైల్ నంబర్‌ను నమోదు చేసి NOC మరియు QR Codeను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

డౌన్‌లోడ్ చేసుకున్న NOC మరియు నిబంధనల పత్రాన్ని లామినేషన్ చేయించి, మండపం వద్ద స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ఉంచాలి, తద్వారా తనిఖీకి వచ్చే పోలీస్ మరియు ఇతర సంబంధిత అధికారులు పరిశీలించడానికి వీలుగా ఉంటుంది.

పోలీసు శాఖ సూచనలు

1. ఊరేగింపుల సమయంలో DJలకు అనుమతి లేదు. పోలీసు శాఖ మరియు సంబంధిత అధికారుల అనుమతులకు లోబడి మాత్రమే శబ్ద పరికరాలను వినియోగించాలి.

2. గణేష్ విగ్రహ ఊరేగింపు సమయంలో అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు, అల్లర్లు లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీ నిర్వాహకులదే.

3. మండపాల వద్ద లౌడ్‌స్పీకర్లను అధిక శబ్దంతో వినియోగించరాదు. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 06:00 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు/శబ్ద పరికరాలను వినియోగించరాదు.

4. మండపాల వద్ద దీపాలు, కొవ్వొత్తులు, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మండపం వద్ద అవసరమైన అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి.

5. ఉత్సవ కమిటీ సభ్యులు మండపం వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, భక్తులు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి.

6. గణేష్ మండపాలను విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు తగిన దూరంలో మరియు రహదారిపై రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాటు చేయాలి.

7. మండపాల వద్ద CCTV కెమెరాలను ఏర్పాటు చేసి, సాధ్యమైనంత వరకు నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలి.

8. మండపాల ఏర్పాటుకు అవసరమైన ఫైర్ సేఫ్టీ మరియు ఎలక్ట్రికల్ అనుమతులు/భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి.

9. మండపాల వద్ద మైనర్లు లేదా పిల్లలను రాత్రి వేళల్లో ఒంటరిగా ఉంచకూడదు. నిర్వాహకులు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి.

10. మండపాల వద్ద విద్యుత్ వైర్లు, ఓపెన్ జాయింట్లు మరియు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లను నిర్లక్ష్యంగా ఏర్పాటు చేయరాదు.

11. మండపాల వద్ద ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు, బాణసంచా లేదా ఇతర ప్రమాదకర వస్తువులను నిల్వ చేయరాదు.

12. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సూచనలు మరియు నిర్దేశిత మార్గాలను తప్పనిసరిగా పాటించాలి.

13. ఊరేగింపు మరియు నిమజ్జనం సమయంలో మద్యం సేవించి పాల్గొనడం, అసభ్యకర ప్రవర్తన, రెచ్చగొట్టే నినాదాలు లేదా ఇతరుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడరాదు.

14. నిమజ్జనం సమయంలో చెరువులు, కాలువలు లేదా ఇతర నీటి వనరుల వద్ద పోలీసు మరియు సంబంధిత శాఖల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రమాదకర ప్రాంతాల్లో నిమజ్జనం చేయరాదు.

15. ఏదైనా అవాంఛనీయ సంఘటన, అగ్ని ప్రమాదం, విద్యుత్ ప్రమాదం లేదా ఘర్షణ జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

పోలీసు శాఖ విజ్ఞప్తి

గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన మరియు సురక్షిత వాతావరణంలో నిర్వహించాలని నర్సీపట్నం టౌన్ పోలీసులు ప్రజలకు మరియు ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతలు మరియు ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి పోలీసు శాఖ జారీ చేసే సూచనలు, నిబంధనలను ప్రతి ఉత్సవ కమిటీ తప్పనిసరిగా పాటించి పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరుతున్నారు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam

Next Story