Chodavaram: 15 ఏళ్లుగా నిరంతరాయంగా మట్టి విగ్రహాల పంపిణీ.. ఎమ్మెల్యే ప్రశంసలు!
Chodavaram: చోడవరంలో సకురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 వేల మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్. రాజు చేతుల మీదుగా భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.
Chodavaram: 15 ఏళ్లుగా నిరంతరాయంగా మట్టి విగ్రహాల పంపిణీ.. ఎమ్మెల్యే ప్రశంసలు!
చోడవరం: పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో మట్టి వినాయకులపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో సకురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఐదు వేల మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. చోడవరం శాసనసభ్యులు కే.ఎస్.ఎన్.ఎస్. రాజు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
సకురు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దివంగత సకురు పెంటారావు మాజీ సర్పంచిగా, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్గా ప్రజలకు సేవలందించారని నిర్వాహకులు తెలిపారు. ఆయన కుమారుడు సకురు కోటేశ్వరరావు గత 15 సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్. రాజు మాట్లాడుతూ.. సకురు కోటేశ్వరరావు చేపడుతున్న మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు. దివంగత సకురు పెంటారావు తనకు రాజకీయ గురువుగా ఉన్నారని, ప్రస్తుతం కోటేశ్వరరావు తన శిష్యుడిగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో యువ నాయకుడిగా ఎదిగి మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు.
మట్టి వినాయక ప్రతిమలను పూజించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజించాలని, తద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతకు తోడ్పడాలని సూచించారు.
సకురు కోటేశ్వరరావు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, ఫౌండేషన్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




