Devarapalli: దేవరాపల్లిలో అప్పలనాయుడు హత్య కేసు ఛేదించిన పోలీసులు!
Devarapalli: భర్త సంపాదించిన సొమ్ముతోనే రూ.1 లక్ష సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య. దేవరాపల్లి హత్య కేసు వివరాలు వెల్లడించిన పోలీసులు.
Devarapalli: దేవరాపల్లిలో అప్పలనాయుడు హత్య కేసు ఛేదించిన పోలీసులు!
దేవరపల్లి: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా మారడంతో అతడిని హత్య చేయించేందుకు భార్యే పథకం రచించినట్లు విచారణలో వెల్లడైంది. భర్త కష్టపడి సంపాదించిన డబ్బులో నుంచే రూ.1 లక్ష తీసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.కె.కోటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. కృష్ణ, దేవరాపల్లి ఎస్ఐ వి. సత్యనారాయణ శనివారం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైవాడ పంచాయతీ శివారు శ్రీరామపురం గ్రామానికి చెందిన దారపురెడ్డి అప్పలనాయుడు బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో మంచంపై శవమై కనిపించాడు. మృతుడి సోదరుడు ఎర్రినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో హత్య వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.కోట మండలం పోతనాపల్లి గ్రామానికి చెందిన సిరికి హైమాకు 11 ఏళ్ల క్రితం అప్పలనాయుడుతో వివాహమైంది. విశాఖపట్నంలో కలాసీగా పనిచేస్తున్న అప్పలనాయుడు వృత్తిరీత్యా ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ సమయంలో దేవరాపల్లిలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న కె.కోటపాడు మండలం జోగన్నపాలెం గ్రామానికి చెందిన బండారు గంగాధర్తో హైమాకు నాలుగున్నరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
కొద్ది రోజుల క్రితం భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన అప్పలనాయుడు తన పనిని సుమారు రూ.2 లక్షలకు విక్రయించి స్వగ్రామానికి వచ్చి ఇంట్లోనే ఉంటూ భార్యపై నిఘా పెట్టాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న అప్పలనాయుడిని హత్య చేయాలని హైమా, గంగాధర్ నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ హత్య కోసం గంగాధర్ తన మేనల్లుడు గొండుపాలెం గ్రామానికి చెందిన వంటాకు నాగచరణ్ను సంప్రదించాడు.
రూ.1 లక్షకు హత్య చేయించేందుకు ఒప్పందం కుదిరినట్లు విచారణలో తేలింది. అప్పలనాయుడు పనిని విక్రయించి ఇంట్లో ఉంచిన నగదులో నుంచే రూ.1 లక్ష తీసి సుపారీగా చెల్లించినట్లు పోలీసులు వెల్లడించారు.బుధవారం అర్ధరాత్రి నాగచరణ్ తన స్నేహితులు షేక్ షఫీర్, ప్రకాశ్తో కలిసి శ్రీరామపురానికి చేరుకున్నాడు. అప్పలనాయుడు నిద్రపోయే వరకు నిందితులను తన ఇంటి మేడపై ఉండమని చెప్పింది హైమా.. తన భర్త పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడని తెలుసుకున్నాక అర్ధరాత్రి హైమ వెనుక తలుపు తెరిచి హంతకులను బెడ్రూమ్లోకి పంపింది. గాఢ నిద్రలో ఉన్న అప్పలనాయుడిని గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితులకు నగదు ఇచ్చి అక్కడి నుంచి పంపించినట్లు విచారణలో వెల్లడైంది.ఈ కేసులో ఏ–1గా భార్య సిరికి హైమా, ఏ–2గా ప్రియుడు బండారు గంగాధర్, ఏ–3గా వంటాకు నాగచరణ్ను అరెస్ట్ చేసినట్లు సీఐ కె. కృష్ణ తెలిపారు. హత్య అనంతరం వీరు రైవాడ వీఆర్వో రమణమ్మ ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న మరో ఇద్దరు నిందితులు షేక్ షఫీర్, ప్రకాశ్ పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.




