Anakapalli: కొత్తూరు పంచాయతీ కార్మికులకు ఆరు నెలల బకాయి జీతాలు ఇవ్వాలి!
Anakapalli: అనకాపల్లి జిల్లా కొత్తూరు పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఆరు నెలల బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ నేత వై.ఎన్. భద్రం.
Anakapalli: కొత్తూరు పంచాయతీ కార్మికులకు ఆరు నెలల బకాయి జీతాలు ఇవ్వాలి!
Anakapalli: కొత్తూరు మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు వై.ఎన్. భద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి సందీప్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వై.ఎన్. భద్రం మాట్లాడుతూ నిత్యం పారిశుధ్య పనులు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. సొంత ఇళ్లు కూడా లేని కార్మికులు అద్దెలు, విద్యుత్ బిల్లులు, మందులు, నిత్యావసర వస్తువుల ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అప్పులు కూడా దొరకని పరిస్థితుల్లో కుటుంబాలను పోషించేందుకు అర్ధాకలితో జీవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తూరు పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఆరు నెలల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని, 2026–27 ఆర్థిక సంవత్సరానికి పారిశుధ్య పనుల కోసం వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. కార్మికులకు చట్టప్రకారం కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మునగపాక మండలం నాగులపల్లిలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను కూడా వెంటనే చెల్లించాలని పంచాయతీ అధికారులను కోరారు.
కార్మికుల సమస్యలపై స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి సందీప్.. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు కొట్టుగుళ్ల నాయుడు, నాగేశ్వరరావు, సత్తిబాబు, నేస్తాలు, చాట్ల లక్ష్మి, మత్తుర్తి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.




