Chintoor: సీహెచ్‌సీ చింతూరుకు నూతన అంబులెన్స్ అందుబాటులోకి వైద్య సేవలు

Chintoor: అరకు ఎంపీ తనూజారాణి నిధులతో సీహెచ్‌సీ చింతూరుకు నూతన అంబులెన్స్ సమకూరింది. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందనున్నాయి.

RAJESH REDDY, CHINTOOR
Published on: 28 Aug 2026 12:08 PM IST
Chintoor
X

Chintoor: సీహెచ్‌సీ చింతూరుకు నూతన అంబులెన్స్ అందుబాటులోకి వైద్య సేవలు

Chintoor: చింతూరు డివిజన్ పరిధిలోని ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మరో కీలక ముందడుగు పడింది.అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి తనూజారాణి ఎంపీ గ్రాంట్ ద్వారా సీహెచ్‌సీ చింతూరు ఆసుపత్రికి నూతన అంబులెన్స్‌ను సమకూర్చారు. ఈ అంబులెన్స్ సేవలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సందర్భంగా చింతూరు ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభం నోఖ్వాల్ మాట్లాడుతూ చింతూరు డివిజన్ భౌగోళికంగా విస్తృతంగా ఉండటంతో పాటు అధిక సంఖ్యలో మారుమూల గిరిజన ప్రాంతాలు ఉన్నందున అత్యవసర సమయాల్లో రోగులను త్వరితగతిన ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్స్ సేవలు ఎంతో కీలకమని తెలిపారు.ఈ అంబులెన్స్ సేవలు ముఖ్యంగా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉన్న రోగులు, గర్భిణీలు, ప్రమాద బాధితులు,వృద్ధులు మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

అంబులెన్స్‌ను ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు ఐటీడీఏ చింతూరు తరఫున ప్రత్యేకంగా డ్రైవర్‌ను నియమించడం జరిగిందని తెలిపారు.అంబులెన్స్ నిర్వహణ, వినియోగం మరియు సేవలను సమర్థవంతంగా అందించేందుకు సంబంధిత వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

చింతూరు డివిజన్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా అందించడంలో ఈ నూతన అంబులెన్స్ కీలకపాత్ర పోషిస్తుందని ప్రాజెక్ట్ ఆఫీసర్ తెలిపారు.ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను సమీపంలోని వైద్య కేంద్రాలకు, అవసరమైన సందర్భాల్లో ఉన్నత స్థాయి ఆసుపత్రులకు సకాలంలో తరలించేందుకు ఈ సేవలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.ప్రజల ప్రాణ రక్షణకు, అత్యవసర వైద్య సేవలకు ఈ అంబులెన్స్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చింతూరు డివిజన్ ప్రజలకు ప్రాజెక్ట్ ఆఫీసర్ విజ్ఞప్తి చేశారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story