Anandapuram: వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు
Anandapuram: ఆనందపురంలో వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు. నిమజ్జనానికి మూడు ప్రధాన పాయింట్లు గుర్తింపు.
Anandapuram: వినాయక నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు
ఆనందపురం: రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గౌరవ విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గారు మరియు డీసీపీ-1 గారి ఆదేశాల మేరకు ఆనందపురం సీఐ గారు, ఎస్ఐ సూర్యనారాయణ గారితో కలిసి ఆనందపురం మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించి నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కుశలవాడ చెరువు, బోని చెరువు, గిడిజాల కోనేరు, గండిగుండం చెరువు తదితర ప్రాంతాలను పరిశీలించారు. తగినంత వర్షపాతం లేకపోవడంతో గండిగుండం చెరువు మినహా మిగిలిన నీటి వనరుల్లో నిమజ్జనానికి సరిపడా నీరు లేని విషయం గుర్తించారు. ఆనందపురం మండల పరిధిలోని వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రధానంగా మూడు ప్రాంతాలను గుర్తించారు.
1. పాండ్రంకి వద్ద గోస్తనీ నది నిమజ్జన పాయింట్
2. గండిగుండం కోనేరు
3. భీమిలి బీచ్
ప్రాంతాల వారీగా నిమజ్జన కార్యక్రమాన్ని క్రమబద్ధీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గండిగుండం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను గండిగుండం కోనేరులోనే నిమజ్జనం చేయాలి.
అదేవిధంగా బోని మరియు పరిసర ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలను పాండ్రంకి సమీపంలోని గోస్తనీ నది నిమజ్జన పాయింట్కు తరలించి నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. మిగిలిన ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలను భీమిలి బీచ్కు నిమజ్జనం నిమిత్తం తరలించనున్నట్లు ఆనందపురం సీఐ VVCM Yerram Naidu గారు తెలిపారు.
వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపులు సజావుగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరిగేలా పోలీస్ శాఖ తరఫున ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, నిమజ్జన ప్రదేశాల వద్ద భద్రతా చర్యలు మరియు అవసరమైన ఇతర ఏర్పాట్లు చేపట్టనున్నట్లు సీఐ గారు తెలిపారు.
వినాయక ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు మరియు భక్తులు పోలీస్ శాఖ సూచనలు, భద్రతా నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఆనందపురం సీఐ గారు కోరారు.




