Anakapalle: పీఆర్సీ అమలుపై హర్షం వ్యక్తం చేసిన ఏపీఎన్జీవోలు
Anakapalle: అనకాపల్లి జిల్లాలో పీఆర్సీ అమలు, సరెండర్ లీవ్ల మంజూరు మరియు ఉద్యోగుల సంక్షేమ నిర్ణయాలపై ఏపీఎన్జీవోల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
Anakapalle: పీఆర్సీ అమలుపై హర్షం వ్యక్తం చేసిన ఏపీఎన్జీవోలు
అనకాపల్లి జిల్లా: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల పీఆర్సీ అమలుపై ఏపీఎన్జీవోలు హర్షం వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనకాపల్లి జిల్లా ఏపీఎన్జీవోల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్జీవోస్ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పీఆర్సీని ప్రభుత్వం అమలు చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పలుమార్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయని తెలిపారు.
2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన ఉద్యోగుల సరెండర్ లీవ్లను కూడా మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాల ద్వారా ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
అదేవిధంగా పెన్షనర్లకు ప్రస్తుతం ఉన్న అదనపు క్వాంటం పెన్షన్ను 7 నుంచి 10 శాతం స్థాయి నుంచి 15 శాతానికి పెంచడం ద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
హెల్త్ కార్డుల విషయంలోనూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రతి నెల మొదటి తేదీన ట్రస్టుకు 35 కోట్ల రూపాయలు జమయ్యేలా చర్యలు తీసుకోవడం వల్ల మెడికల్ బిల్లుల చెల్లింపులు ఎలాంటి జాప్యం లేకుండా జరిగే అవకాశం ఉందన్నారు.
ఈ సమస్యలపై దాదాపు 12 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఉద్యోగులకు తాజా నిర్ణయాలతో ఉపశమనం లభించిందని జిల్లా ఎన్జీవోస్ అధ్యక్షుడు రవి పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనకాపల్లి జిల్లా ఎన్జీవోస్, జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




