Vijayawada: పోస్టర్ల కోసం ప్రత్యేక గోడ ఏర్పాటు చేసిన విజయవాడ నగరపాలక సంస్థ!

Vijayawada: విజయవాడను పోస్టర్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక గోడ కేటాయింపు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలని VMC కమిషనర్ హెచ్చరిక.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Updated on: 29 Aug 2026 1:00 PM IST
Vijayawada
X

Vijayawada: పోస్టర్ల కోసం ప్రత్యేక గోడ ఏర్పాటు చేసిన విజయవాడ నగరపాలక సంస్థ!

Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పోస్టర్ల కోసం ప్రత్యేక గోడ ఏర్పాటు చేశామని, కేటాయించిన గోడపైనే పోస్టర్లు అంటించాలి.

ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు అంటిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం నగరంలోని మహాత్మా గాంధీ రోడ్, పంట కాలువ రోడ్డు, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్, పటమట ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని పోస్టర్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు అంటిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. పోస్టర్లు అంటించే వారి కోసం నగరంలో ప్రత్యేకంగా ఒక గోడను కేటాయించాలని గతంలో అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో పంట కాలువకు వెళ్లే మార్గంలో ఒక గోడను పోస్టర్ల కోసం కేటాయించినట్లు పట్టణ ప్రణాళిక అధికారులు కమిషనర్‌కు వివరించారు. ఈ గోడను “డెడికేటెడ్ వాల్ ఫర్ పోస్టర్స్”గా అమల్లోకి తీసుకురావాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

నగరంలో పోస్టర్లు అంటించదలచిన వారు కేవలం కేటాయించిన ప్రత్యేక గోడపైనే పోస్టర్లు అంటించాలని, ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు అంటిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.

అనంతరం ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను కమిషనర్ పరిశీలించారు. అక్కడ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించారు. వ్యర్థాలను సకాలంలో తరలిస్తున్నట్లు గుర్తించి సంతృప్తి వ్యక్తం చేశారు.

తదుపరి పటమటలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించారు. అన్న క్యాంటీన్ సేవలను మరింత మెరుగుపరిచి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్‌లో సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

అన్న క్యాంటీన్లను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ప్రజలకు ఆరోగ్యకరమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే. షమీ, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ డాక్టర్ గోపాల నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్లు వి. చంద్రశేఖర్, కె.దుష్యంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్‌చార్జ్ రామారావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story