Vijayawada: విజయవాడలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ-2026 పరీక్ష!
Vijayawada: విజయవాడలో నీట్ పీజీ–2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రెండు కేంద్రాల్లో 818 మంది హాజరుకాగా, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
Vijayawada: విజయవాడలో ప్రశాంతంగా ముగిసిన నీట్ పీజీ-2026 పరీక్ష!
విజయవాడ: విజయవాడలో నీట్ పీజీ–2026 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, విద్యుత్, తాగునీరు తదితర అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచడంతో అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షకు హాజరయ్యారు.
పీఎస్సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ విజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్ (ఎనికేపాడు) కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు నీట్ పీజీ–2026 పరీక్ష నిర్వహించారు. రెండు పరీక్షా కేంద్రాల్లో కలిపి మొత్తం 843 మంది అభ్యర్థులకు గాను 818 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. శ్రీ విజయదుర్గ ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్ పరీక్షా కేంద్రంలో 530 మంది అభ్యర్థులకు గాను 512 మంది హాజరయ్యారు. పీఎస్సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కేంద్రంలో 313 మంది అభ్యర్థులకు గాను 306 మంది పరీక్షకు హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పీఎస్సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించడంతో పాటు అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థుల ప్రవేశం, పరీక్ష నిర్వహణ ప్రక్రియ, భద్రతా చర్యలను పరిశీలించిన కలెక్టర్.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.




