Sullurupeta: ఓటర్ల డిజిటలైజేషన్ ముమ్మరం: 65 శాతం పనులు పూర్తి!
Sullurupeta:
Sullurupeta: ఓటర్ల డిజిటలైజేషన్ ముమ్మరం: 65 శాతం పనులు పూర్తి!
సూళ్లూరుపేట: ఓటర్ల నమోదు మరియు డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తహశీల్దార్ శైలకుమారి క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను సమీక్షించారు. ఇందులో భాగంగా నేడు మాతకముడి (పి.ఎస్ నెం. 196), ఇల్లుపూరు (పి.ఎస్ నెం. 200), మంగళంపాడు (పి.ఎస్ నెం. 198, 199) పోలింగ్ స్టేషన్లను సందర్శించి వివరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ శైలకుమారి మాట్లాడుతూ, ఈ ప్రాంతాలలో ఉన్న మొత్తం 26,753 మంది ఓటర్లకు సంబంధించి, ఇప్పటివరకు 65 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయబడిందని తెలిపారు. బి.ఎల్.ఓలు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉండి ప్రజల నుండి ఎన్యూమరేషన్ ఫారమ్స్ సేకరిస్తున్నారని, వీటిని ఎప్పటికప్పుడు డిజిటలైజ్ చేస్తూ పారదర్శకత పాటిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడమే లక్ష్యమని, పనులలో ఎటువంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవ్వాళ మధ్యాహ్నం వేళలో షార్ (SHAR) లోని 259, 260 మరియు 261 పోలింగ్ స్టేషన్లను సందర్శించి అక్కడ జరుగుతున్న పనితీరును కూడా పర్యవేక్షించనున్నట్లు ఆమె వివరించారు. ఓటర్ల వివరాల సేకరణ, డిజిటలైజేషన్ పకడ్బందీగా జరిగేలా చూస్తున్నామని, ప్రజలు తమ వివరాలను నమోదు చేయించుకోవడంలో సహకరించాలని ఆమె కోరారు. నిర్ణీత సమయంలోగా ప్రక్రియను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. ఈ పర్యటనలో రెవెన్యూ సిబ్బంది, బి.ఎల్.ఓలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు మరియు డిజిటలైజేషన్ పనుల వల్ల రాబోయే రోజుల్లో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ఆమె తెలిపారు.




