Sullurpeta: సూళ్ళూరుపేటలో ఉచిత మంచినీటి ట్రాక్టర్ల ప్రారంభం
Sullurpeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో ఉచిత మంచినీటి ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. దాత కొండేపాటి గంగాప్రసాద్ సౌజన్యంతో సరఫరా.
Sullurpeta: సూళ్ళూరుపేటలో ఉచిత మంచినీటి ట్రాక్టర్ల ప్రారంభం
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ సౌజన్యంతో ఉచితంగా మంచి నీటిని అందించే ట్రాక్టర్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు (ఎమ్మెల్యే) డా. నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా విచ్చేసి, పచ్చజెండా ఊపి ఉచిత మంచినీటి ట్రాక్టర్లను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతో గత 24 సంవత్సరాలుగా నిర్విరామంగా కొండేపాటి గంగాప్రసాద్ అందిస్తున్న సహకారం అభినందించదగ్గదని కొనియాడారు. ఈ ఉచిత మంచినీటి ట్రాక్టర్ల ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని సూళ్ళూరు, వట్రపాలెం, సాయినగర్ గిరిజన కాలనీ, కోళ్లమిట్ట, కసారెడ్డి పాలెం, మన్నారుపోలూరు ప్రాంతాలకు నిరంతరం నీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.
ఎండాకాలంలో తమ ప్రాంతాల నీటి ఇబ్బందులను తొలగించేందుకు ఏళ్ల తరబడి సేవనందిస్తున్న ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఎదురులేని నాయకురాలిగా గుర్తింపు పొందారని ప్రజలు అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె పడుతున్న శ్రమ అంతాఇంతా కాదని, కేవలం పదవికోసం కాకుండా ప్రజల కష్టాలను తీర్చే నాయకురాలిగా ఆమె ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడుతున్నారు. ఎమ్మెల్యే అంటే ఏదో అనే విధంగా కాకుండా, తాగునీటి సమస్య వంటి కష్టాల కోసం స్పందించి ఇలాంటి సేవలు అందించడం ఎంతో అభినందనీయమని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పరిశీలకులు మరియు ప్రముఖ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏ.జి. కిషోర్, పచ్చవ మాధవ నాయుడు, చిట్టేటి పెరుమాళ్ తదితరులు పాల్గొన్నారు.




