Sullurpeta: సూళ్ళూరుపేట జనసేన పార్టీకి షాక్.. కాంగ్రెస్లోకి ఆవుల రమణ
Sullurpeta: సూళ్ళూరుపేటలో జనసేన పార్టీకి ఎదురుదెబ్బ. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జనసేన మండల అధ్యక్షుడు ఆవుల రమణ. నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.
Sullurpeta: సూళ్ళూరుపేట జనసేన పార్టీకి షాక్.. కాంగ్రెస్లోకి ఆవుల రమణ
సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జనసేన సూళ్ళూరుపేట మండల అధ్యక్షుడు ఆవుల రమణ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ జీవివిఎస్ కమలాకరరావు, కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలగురువం బాబు ఆధ్వర్యంలో, నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ కుమార్ నాయకత్వంలో ఆవుల రమణకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ఇప్పటికే సూళ్ళూరుపేట పట్టణంలో జనసేన పార్టీకి బలమైన నాయకత్వం కరువైందనే చర్చ నియోజకవర్గంలో బలంగా సాగుతోంది. ఈ క్రమంలో మండల అధ్యక్ష హోదాలో ఉన్న ఆవుల రమణ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో సూళ్ళూరుపేట పట్టణంలో ఇక జనసేన నాయకులే లేరన్న ప్రచారం నిజమేనని స్థానిక రాజకీయ సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేకమంది నాయకులు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుండి మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జనామోద పోరాటాలే పార్టీ పునర్వైభవానికి సంకేతాలని వివరించారు.
పార్టీ మారిన ఆవుల రమణ మాట్లాడుతూ, నియోజకవర్గాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, నియోజకవర్గంలో పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆరు మండలాల అధ్యక్షులు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




