Sullurupeta: ఓటర్ల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు!

Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలంలోని కోటపోలూరు, ఉగ్గుమూడి గ్రామాల్లో ఓటర్ల జాబితా లోపాల సవరణకు అధికారులు ప్రత్యేక పరిశీలన చేపట్టారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 24 Aug 2026 10:29 PM IST
Sullurupeta
X

Sullurupeta: ఓటర్ల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అధికారుల తనిఖీలు!

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండల పరిధిలోని కోటపోలూరు గ్రామం 212వ సంఖ్య గల పోలింగ్ కేంద్రం ఓటరు జాబితాలో నెలకొన్న పలు సాంకేతిక, పరిపాలనా సమస్యల పరిష్కారానికి అధికారుల బృందం సోమవారం ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఓటర్ల వివరాల్లో దొర్లిన తప్పులు, ఇళ్ల సంఖ్యల కేటాయింపులో ఉన్న మ్యాపింగ్ లోపాలను క్షేత్రస్థాయిలో సరిచేసేందుకు ఈ చర్యలు చేపట్టారు.

​కోటపోలూరు గ్రామంలో సూళ్ళూరుపేట తహసీల్దార్ శైలకుమారి స్వయంగా పర్యవేక్షించి, స్థానిక ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అదేవిధంగా ఉగ్గుమూడి గ్రామంలో స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) నేతృత్వంలో అధికారుల బృందం నివాసాల వారీగా తనిఖీలు చేపట్టింది. జాబితాలో పేర్ల తప్పులు, వయస్సు, చిరునామా మార్పులు, ఓటర్ల మ్యాపింగ్ లేకపోవడం వంటి సమస్యలపై స్థానిక నివాసితుల నుంచి వచ్చిన వినతులు, అభ్యంతరాలను అధికారులు పరిశీలించారు. సవరణలకు సంబంధించి అర్హులైన వారి నుంచి తగిన దరఖాస్తులను అక్కడికక్కడే స్వీకరించారు.

​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి పౌరుడికి ఓటరు జాబితాలో సరైన గుర్తింపు కల్పించడమే తమ ప్రాథమిక బాధ్యత అని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను తయారు చేయడమే ఈ ప్రత్యేక తనిఖీల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఓటర్లు తమ పరిధిలోని వివరాలను పరిశీలించుకుని, ఏవైనా పొరపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సవరించుకోవాలని సూచించారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story