Renigunta: రేణిగుంటలో వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసుల అలెర్ట్!
Renigunta: వినాయక మండపాలకు ఆన్లైన్లో ఉచిత అనుమతులు. డీజేలకు అనుమతి లేదు, సీసీ కెమెరాలు తప్పనిసరని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర స్పష్టం.
Renigunta: రేణిగుంటలో వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసుల అలెర్ట్!
Renigunta: వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర సూచించారు. రేణిగుంట ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండపాల అనుమతుల కోసం ganeshutsav.net వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, విగ్రహం–మండపం ఎత్తు, కమిటీ సభ్యుల వివరాలు, నిమజ్జనం తేదీ, సమయం, ప్రదేశం తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న మండపాలకు క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తామని తెలిపారు.
మండపాల వద్ద డీజేలు, అసభ్యకర ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిమజ్జనం ఊరేగింపులు నిర్ణయించిన మార్గాల్లోనే నిర్వహించాలని, మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనరాదని సూచించారు. అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావివ్వకుండా ఉత్సవ కమిటీలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సూచించారు. దీంతో నిర్వాహకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు అవాంఛనీయ ఘటనలు జరిగితే గుర్తించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉత్సవ కమిటీ నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించి వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.




