TGSRTC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% డిస్కౌంట్!
TGSRTC: హైదరాబాద్లో ఇంధన కొరత నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం. మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీ ప్రకటిస్తూ ఎండీ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
TGSRTC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30% డిస్కౌంట్!
TGSRTC: హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత వదంతులు, పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర సాగుతున్న క్యూ లైన్ల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఊరటనిచ్చేలా మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు.
పెట్రోల్ కోసం తిప్పలు ఎందుకు దండగ?
ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. నగరవాసులకు కీలక సూచనలు చేశారు. "పెట్రోల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఆర్టీసీ బస్సులు ఉండగా ఈ ఇబ్బందులన్నీ ఎందుకు దండగ?" అని ఆయన ప్రశ్నించారు. సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజారవాణాను ఆశ్రయించడం వల్ల అటు వ్యక్తిగత ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, దేశ ఇంధన ఆదాకు తోడ్పడతారని పేర్కొన్నారు.
ఏసీ బస్సుల్లో రాయితీ.. లగ్జరీ ప్రయాణం!
సాధారణంగా ఏసీ బస్సు ప్రయాణం ఖరీదైనదిగా భావించే వారికి ఈ 30 శాతం రాయితీ ఒక గొప్ప అవకాశమని ఆయన తెలిపారు. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించడం ద్వారా కాలుష్య నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గడం వల్ల రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు కూడా పరిష్కారమవుతాయని వివరించారు.
సేఫ్గా బస్సెక్కండి.. సుఖంగా వెళ్లండి!
"బంకుల వద్ద బారులు తీరొద్దు.. సేఫ్గా బస్సెక్కండి" అంటూ నాగిరెడ్డి నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతి చుక్క ఇంధనం విలువైనదని, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని ఆకాంక్షించారు.




