Telangana EV Scheme: ఆటో డ్రైవర్లకు జాక్‌పాట్.. రూ.1.50 లక్షల సబ్సిడీ.!

Telangana EV Scheme: తెలంగాణలోని ఆటోరిక్షా కార్మికులకు భారీ ఆర్థిక ఊరటనిస్తూ, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది.

G Krishna
Published on: 27 Aug 2026 4:50 PM IST
Telangana EV Scheme
X

Telangana EV Scheme: ఆటో డ్రైవర్లకు జాక్‌పాట్.. రూ.1.50 లక్షల సబ్సిడీ.!

Telangana EV Scheme: తెలంగాణలోని ఆటోరిక్షా కార్మికులకు భారీ ఆర్థిక ఊరటనిస్తూ, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని పట్టణ రవాణా వ్యవస్థను నెట్-జీరో కార్బన్ ఉద్గారాల వైపు మళ్లించేందుకు రవాణా, రహదారులు , భవనాల శాఖ అధికారికంగా జీవో జారీ చేసింది. పాత పెట్రోల్, డీజిల్ ఆటోల వల్ల వెలువడే కాలుష్యానికి అడ్డుకట్ట వేస్తూ, పెరిగిన ఇంధన ధరలతో అల్లాడుతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ప్రభుత్వం ఏకంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ నిధులను కేటాయించి అధికారికంగా శ్రీకారం చుట్టింది.

తొలి దశలో 18,766 ఆటోల మార్పిడి లక్ష్యం

ఈ పథకం కింద మొదటి విడతలోనే భారీ స్థాయిలో పాత ఇంధన ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని నిర్ణయించారు. దీనికోసం అర్బన్ పరిధిలో తిరిగే 11,254 డీజిల్ ఆటోలు , 7,512 పెట్రోల్ ఆటోలతో కలిపి మొత్తం 18,766 ఆటోలను గుర్తించారు. నగరాల్లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ఈ నిర్ణయం చాలా కీలకం కానుంది. అదే సమయంలో ప్రతిరోజూ ఆటోలో లీటర్ల కొద్దీ పోయించే డీజిల్, పెట్రోల్ ఖర్చులు భరించలేక ఇబ్బందిపడుతున్న డ్రైవర్లకు ఎలక్ట్రిక్ వాహనాల్లోకి మారడం వల్ల శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

రూ. 1.50 లక్షల సబ్సిడీ.. ఆటో యజమానులకు రెండు సదుపాయాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా అర్హులైన ప్రతి ఆటో యజమానికి గరిష్ఠంగా రూ. 1.50 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని సబ్సిడీ రూపంలో అందించనున్నారు. లబ్ధిదారులు తమ ఆర్థిక సౌలభ్యాన్ని , వీలును బట్టి పాత ఆటోను ఈవీగా మార్చుకోవడం లేదా కొత్త ఈవీ ఆటో కొనుగోలు చేయడం అనే రెండు రకాల విధానాలలో ఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటును సర్కార్ కల్పించింది. మొదటి విధానంలో, పాత ఆటోలోని ఇంజిన్‌ను తొలగించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా అన్ని ప్రమాణాలు కలిగిన ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుకోవచ్చు. ఇందులో బ్యాటరీని నిరంతరం ఛార్జింగ్ చేసుకునే విధానం లేదా ఛార్జింగ్ లేనప్పుడు సులభంగా బ్యాటరీ మార్చుకునే సిస్టమ్‌లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఇక రెండో విధానంలో, పాత పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను స్క్రాపింగ్ చేసి రద్దు పత్రం సమర్పిస్తే, కొత్త ఎలక్ట్రిక్ 3-వీలర్ కొనుగోలుపై నేరుగా డీలర్ వద్దే ఆన్-రోడ్ ధర నుండి రూ. 1.50 లక్షల సబ్సిడీ మినహాయింపు లభిస్తుంది.

తగ్గనున్న ఖర్చులు.. పెరగనున్న కార్మికుల నికర ఆదాయం

ప్రస్తుతం లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కోసం రోజుకు వందలాది రూపాయలు వెచ్చించాల్సి రావడం వల్ల ఆటో డ్రైవర్లు రోజంతా కష్టపడినా చేతికి మిగిలేది చాలా తక్కువగా ఉంటోంది. అయితే ఎలక్ట్రిక్ ఆటోలకు మారిన తర్వాత రీఛార్జింగ్ ఖర్చులు నామమాత్రంగానే ఉంటాయి కాబట్టి రోజువారీ ఇంధన వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల డ్రైవర్ల నికర ఆదాయం పెరిగి వారి కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఒకవైపు ఆటో కార్మికుల సంక్షేమం, మరోవైపు పట్టణ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వచ్చిన ఈ పథకం రాబోయే రోజుల్లో తెలంగాణ రవాణా రంగానికి ఒక సరికొత్త మార్గదర్శిగా నిలవనుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story