Sangareddy: ప్రియుడితో వెళ్లిపోయిందని కక్ష.. పోలీసుల ముందే భార్య హత్య!
Sangareddy: వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
Sangareddy: ప్రియుడితో వెళ్లిపోయిందని కక్ష.. పోలీసుల ముందే భార్య హత్య!
Sangareddy: వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనను కాదని ప్రియుడితో వెళ్లిపోయిందన్న కోపంతో ఒక భర్త కదులుతున్న కారులోనే భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది వద్ద చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
జహీరాబాద్కు చెందిన బాధితురాలు గత నెలలో తన ప్రియుడితో కలిసి కనిపించకుండా పోయింది. దీనిపై ఆమె భర్త మార్చి 30న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సదరు మహిళ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో తన ప్రియుడితో కలిసి ఉన్నట్లు గుర్తించారు.
తిరుగు ప్రయాణంలో ఘర్షణ:
ఆమెను తిరిగి జహీరాబాద్కు తీసుకువచ్చేందుకు పోలీసులు, ఆమె భర్త కలిసి జడ్చర్ల వెళ్లారు. అక్కడ ఆమెను అదుపులోకి తీసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, కారులో వస్తున్న సమయంలో భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆమె ప్రవర్తనపై ఆగ్రహంతో ఉన్న భర్త, కారు సదాశివపేట మండలం నందికంది సమీపానికి చేరుకోగానే, తన వద్ద ఉన్న పదునైన వస్తువుతో ఆమె గొంతు కోశాడు.
పోలీసుల సమక్షంలోనే..
పోలీసులు వెంట ఉన్నప్పటికీ ఈ ఘోరం జరగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు కారులోనే ప్రాణాలు వదిలింది. నిందితుడిని పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి తీసుకువెళ్తుండగా, మరోవైపు భర్త ఇంతటి తెగింపునకు ఒడిగట్టడం స్థానికంగా సంచలనంగా మారింది.




