Raghunandan Rao: 22ఏ భూముల సమస్య పరిష్కారానికి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలి

Raghunandan Rao: 22ఏ నిషేధిత భూముల సమస్యపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు.

Arun Chilukuri
Published on: 15 Sept 2026 1:06 PM IST
Raghunandan Rao
X

Raghunandan Rao: 22ఏ భూముల సమస్య పరిష్కారానికి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలి

Raghunandan Rao: తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల చట్టం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీలో 22ఏపై సమగ్ర చర్చ జరుగుతుందని ప్రజలు ఆశించినప్పటికీ ప్రభుత్వ వైఖరి వల్ల అది జరగలేదని విమర్శించారు.

గుడులు, బడులు, దేవస్థానాలు మరియు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమే అప్పట్లో 22ఏ చట్టం తెచ్చారని, కానీ ప్రస్తుతం ఇది పేదలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరైన ప్రిపరేషన్ లేకుండానే అసెంబ్లీకి వచ్చారని ఎద్దేవా చేశారు.

2ఏ జాబితా నుంచి తొలగించామంటున్న 47,440 ఎకరాల భూమి ఏ జిల్లాలో, ఏ ఊరిలో తొలగించారో మంత్రి పొంగులేటి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గత బీఆర్ఎస్ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ పేదలకు అన్యాయం చేసిన అధికారులు, కలెక్టర్లపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 22ఏ కింద కోటి రెండు లక్షల ఎకరాలకు పైగా భూమి ఉందని, ఇంత భారీ మొత్తంలో భూములు ఎలా చేర్చారు? ఎప్పటిలోగా తొలగిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.

22ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, తెలంగాణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని, భూ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. ధరణి, భూ భారతి తెచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.