Kavitha: ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ..
Kavitha: తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ మేరకు ఒక కీలక ప్రకటన చేశారు.
Kavitha: తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ మేరకు ఒక కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు వెల్లడించారు.
మేడ్చల్లో భారీ బహిరంగ సభ:
మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అధ్వయ కన్వెన్షన్లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సమావేశంలో పార్టీ పేరును, జెండాను అధికారికంగా ప్రకటించనున్నట్లు కవిత తెలిపారు. "శ్రీరామనవమి పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజే ఈ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు.
మహిళలు, యువతే లక్ష్యంగా:
తమ పార్టీలో యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. "ఇన్నాళ్లూ పురుషులు ఏర్పాటు చేసిన పార్టీలను తెలంగాణ ప్రజలు చూశారు. ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను పార్టీ పెడితే ఎలా ఉంటుందో, మహిళా నాయకత్వం ప్రాధాన్యత ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తాం" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని తాజా రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. పార్టీ విధివిధానాలు, భవిష్యత్తు కార్యాచరణను ఏప్రిల్ 25న ప్రకటించే అవకాశం ఉంది.




