Hyderabad: మంత్రుల సమక్షంలోనే బాహాబాహీ: ఫిరోజ్ఖాన్ను కిందకు నెట్టేసిన ఉస్మాన్.. గాంధీభవన్లో ఉద్రిక్తత!
Hyderabad: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తీవ్ర కలకలం రేగింది. పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్లో బుధవారం జరిగిన అంతర్గత సమావేశం కాస్తా నేతల మధ్య బాహాబాహీకి దారితీసింది.
Hyderabad: మంత్రుల సమక్షంలోనే బాహాబాహీ: ఫిరోజ్ఖాన్ను కిందకు నెట్టేసిన ఉస్మాన్.. గాంధీభవన్లో ఉద్రిక్తత!
Hyderabad: హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తీవ్ర కలకలం రేగింది. పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్లో బుధవారం జరిగిన అంతర్గత సమావేశం కాస్తా నేతల మధ్య బాహాబాహీకి దారితీసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ సమక్షంలోనే కాంగ్రెస్ కీలక నేతలు ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ ఒకరినొకరు నెట్టుకుంటూ ఘర్షణకు దిగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఈ వివాదానికి ప్రొటోకాల్ అంశమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సమావేశంలో మంత్రి అజహరుద్దీన్ పక్కన కూర్చునే సీటు విషయంలో ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఒక్కసారిగా వాగ్వాదం చెలరేగింది. మాట మాట పెరిగి ఇద్దరు నేతలు పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లారు. ఈ తోపులాటలో ఉస్మాన్ అల్ హజ్రీ బలంగా నెట్టివేయడంతో ఫిరోజ్ఖాన్ ఒక్కసారిగా కిందపడిపోయారు.
రంగంలోకి దిగిన సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఇరువర్గాలను శాంతింపజేసేందుకు, ఘర్షణను అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, ఆగ్రహంతో ఉన్న నేతలు ఆయనను సైతం నెట్టివేసేలా ప్రవర్తించడంతో అక్కడున్న మిగతా నాయకులు, కార్యకర్తలు షాక్కు గురయ్యారు. వెంటనే జోక్యం చేసుకున్న ఇతర నేతలు ఇరువర్గాలను విడదీశారు.
మంత్రుల ముందే పార్టీ సీనియర్ నేతలు ఇలా వీధి రౌడీల్లా కొట్టుకోవడంతో తీవ్ర అసహనానికి గురైన మంత్రి అజహరుద్దీన్ సమావేశం మధ్యలోనే అక్కడి నుంచి నిష్క్రమించారు. గాంధీభవన్లో పరిస్థితి చేజారిపోతుండటంతో, ఇక చేసేదేమీ లేక హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో గాంధీభవన్ పరిసరాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




