Weather Update : తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి.. ఏపీలో వడగాల్పుల హెచ్చరిక.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

Weather Update : ఏపీ, తెలంగాణలో ఎండల విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 93 మండలాల్లో వాతావరణ శాఖ వడగాల్పుల హెచ్చరిక జారిచేసింది. అలాగే తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

CR Reddy
Published on: 11 April 2026 9:08 AM IST
Weather Update
X

Weather Update

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుండటంతో వాతావరణ శాఖ డేంజర్ బెల్స్ మోగించింది. ముఖ్యంగా నేడు (శనివారం), రేపు (ఆదివారం) ఎండల తీవ్రత పీక్ స్టేజ్‌కు చేరుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలో వడగాల్పుల విధ్వంసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖన్ జైన్ తాజా నివేదిక ప్రకారం.. నేడు (ఏప్రిల్ 11) రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని 20 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని 14 మండలాలు, శ్రీకాకుళంలోని 8 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. శనివారం దాదాపు 79 మండలాల్లో వేడి గాలులు వీస్తుండగా, ఆదివారం నాటికి ఈ సంఖ్య 93 మండలాలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. నిన్న కాకినాడ జిల్లా కరపలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప, తిరుపతి, ఏలూరు వంటి జిల్లాల్లో కూడా పాదరసం 43 డిగ్రీలు దాటేసింది.

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలో కూడా పరిస్థితి ఏమీ ఆశాజనకంగా లేదు. రాబోయే 3-4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉండటంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

పిడుగుల హెచ్చరిక

ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అల్పపీడన ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఏపీలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఎండ తీవ్రత వల్ల మేఘాలు త్వరగా ఏర్పడి పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున, పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు.

ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు

ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయట తిరగకపోవడమే మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలి. డీహైడ్రేషన్ బారిన పడకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా నీళ్లు తాగుతూ ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story