Kapra: ఎండలో రేషన్ కార్డుదారులకు 'చల్లని' కబురు
Kapra: తిరుమలానగర్ రేషన్ దుకాణం వద్ద పౌర సరఫరాల శాఖ అవగాహన సదస్సు.
Kapra: ఎండలో రేషన్ కార్డుదారులకు 'చల్లని' కబురు
Kapra: హెచ్ బి కాలని డివిజన్ తిరుమలానగర్ కాలనీలోని రేషన్ దుకాణంలో మంగళవారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. ఉప్పల్ సర్కిల్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ డి. సంధ్య, డిప్యూటీ తహసిల్దార్ ప్రదీప్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, దినేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని రేషన్ పంపిణీ తీరును పరిశీలించారు. స్థానిక డీలర్ మల్లేష్ గౌడ్ దుకాణం వద్ద జరిగిన ఈ సమావేశంలో అధికారులు వినియోగదారులతో నేరుగా ముచ్చటించారు. రేషన్ బియ్యం నాణ్యత, బరువు మరియు పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందుల పై కార్డుదారుల నుండి సమాచారాన్ని సేకరించారు.
ఈ-కేవైసీ (e-KYC) నమోదు మరియు రేషన్ కార్డుల వినియోగంపై ప్రజలకు తగు సూచనలు, సలహాలు అందించారు. కార్డుదారులు ఫిర్యాదులు ఉంటే వెనుకాడకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం భానుడి భగభగలు పెరుగుతున్న నేపథ్యంలో, రేషన్ కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం అధికారులు మానవత్వాన్ని చాటుకున్నారు. అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ సంధ్య స్వయంగా వినియోగదారులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు.
ఎండలో క్యూలైన్లలో వేచి ఉండే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు ఎక్కువగా తాగాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ఎండల దృష్ట్యా సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ సిబ్బంది మరియు స్థానిక వినియోగదారులు పాల్గొన్నారు.


