Chicken Shops Strike : చికెన్ ప్రియులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి షాపులు బంద్.. పౌల్ట్రీ కంపెనీలపై వ్యాపారుల యుద్ధం

Chicken Shops Strike : తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చికెన్ ప్రియులు అప్రమత్తంగా ఉండాలని అసోసియేషన్ వెల్లడించింది.

CR Reddy
Published on: 30 March 2026 8:06 AM IST
Chicken Shops Strike
X

Chicken Shops Strike

Chicken Shops Strike : తెలంగాణలోని మాంసం ప్రియులకు ఇది నిజంగా చేదు వార్త. వచ్చే నెల అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడనున్నాయి. చికెన్ షాపుల యజమానుల సంఘం ఈ మేరకు బంద్‌కు పిలుపునిచ్చింది. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో, చికెన్ షాపుల ముందు బంద్‌కు సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. కస్టమర్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వ్యాపారులు ముందస్తుగానే ఈ విషయాన్ని ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఆదివారం నాటి విందులకు కూడా బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.

వ్యాపారులు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు?

చికెన్ వ్యాపారుల ప్రధాన సమస్య ప్రాఫిట్ మార్జిన్. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభాన్ని భారీగా తగ్గించేశాయని షాపుల యజమానులు ఆరోపిస్తున్నారు. చికెన్ అమ్మగా వచ్చే లాభం కనీసం షాపు అద్దెకు, కరెంట్ బిల్లులకు కూడా సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు తమ ఇష్టానుసారంగా రేట్లు నిర్ణయిస్తూ, చిల్లర వ్యాపారులను నష్టాల్లోకి నెడుతున్నాయని మండిపడుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు, అంటే పౌల్ట్రీ కంపెనీలు దిగి వచ్చి మార్జిన్ పెంచే వరకు ఈ బంద్ కొనసాగిస్తామని వారు తెగేసి చెబుతున్నారు.

ఎండల ఎఫెక్ట్.. మండుతున్న ధరలు

సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడటంతో సరఫరా తగ్గి ధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది కూడా చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజులుగా కిలో చికెన్ ధర ఏకంగా రూ.400 మార్కును తాకింది. అయితే, తాజాగా ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. మార్చి 29 నాటికి హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.370 ఉండగా, ఏపీలోని అమలాపురంలో రూ.350 వద్ద కొనసాగుతోంది. ఈ ధరల ఒడిదుడుకుల మధ్య ఇప్పుడు బంద్ పిలుపు రావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

అపరిమిత కాలం బంద్ కొనసాగేనా?

చికెన్ షాప్స్ ఓనర్ల అసోసియేషన్ ఈసారి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. పౌల్ట్రీ కంపెనీలు ప్రతినిధులతో చర్చలు జరిపి తమకు న్యాయం చేసే వరకు షాపుల షట్టర్లు తీసేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఈ బంద్ సుదీర్ఘ కాలం కొనసాగితే, చికెన్ లభ్యత తగ్గిపోయి ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా ఈ ప్రభావం గట్టిగా పడనుంది. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలు, వ్యాపారుల మధ్య సయోధ్య కుదర్చాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.

CR Reddy

CR Reddy

Next Story