చర్లపల్లి కేసులో ట్విస్ట్: భార్యాపిల్లలను వారే చంపారు - భర్త ఫిర్యాదు

Cherlapally Railway Track Death Case: చర్లపల్లి రైలు ప్రమాద మరణాల కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 13 April 2026 12:24 PM IST
Cherlapally Railway Track Death Case
X

చర్లపల్లి కేసులో ట్విస్ట్: భార్యాపిల్లలను వారే చంపారు - భర్త ఫిర్యాదు

Cherlapally Railway Track Death Case: మూడు నెలల క్రితం చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లల మృతి చెందిన ఘటనలో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఆత్మహత్యగా భావిస్తున్న ఈ కేసులో, మృతురాలి భర్త సురేందర్ రెడ్డి తాజాగా పోలీసులను ఆశ్రయించడం కలకలం రేపుతోంది.

భర్త సంచలన ఆరోపణలు:

సురేందర్ రెడ్డి మేడిపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన అత్తగారి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన భార్య విజయశాంతి, కుమార్తె చైతన్య, కుమారుడు విశాల్‌ల మరణానికి బావమరిది చిరంజీవి, అత్త పుష్పావతి, లక్ష్మిలే కారణమని పేర్కొన్నారు. తన ఆస్తిని దక్కించుకోవడానికే వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని, ఇప్పుడు తనను కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వెంటనే పోలీస్ రక్షణ కల్పించాలని సురేందర్ రెడ్డి కోరారు.

బోడుప్పల్‌లో నివసించే ఈ కుటుంబంలో విజయశాంతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉండగా, సురేందర్ రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేసేవారు. జనవరి 30 అర్ధరాత్రి చర్లపల్లి ట్రాక్‌పై ముగ్గురూ శవమై కనిపించడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంటర్ చదువుతున్న పిల్లలు అంతటి నిర్ణయం తీసుకోవడంపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన మేడిపల్లి పోలీసులు, ఈ కేసును ఆత్మహత్య కోణం నుండి కాకుండా హత్య లేదా ఆత్మహత్య ప్రేరేపణ కోణంలో విచారించే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story