Bandi Sanjay: అందరికీ ఛాన్స్ ఇచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండి
Bandi Sanjay: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Bandi Sanjay: అందరికీ ఛాన్స్ ఇచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండి
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ (BJP) అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం బండి సంజయ్ మీడియాలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని బండి సంజయ్ మండిపడ్డారు. "గడిచిన పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను పూర్తిగా దోచుకుంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. నాడు బీఆర్ఎస్ దోచుకుంటే.. నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటోంది" అని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే తీవ్ర అసహ్యం మొదలైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే 14 వందల మంది అమాయక యువకులు బలిదానం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని, రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలోనూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా సాగించడంలోనూ ప్రభుత్వానికి అస్సలు శ్రద్ధ లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలకు పాలించే అవకాశం ఇచ్చారని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి, నిజమైన ప్రజాస్వామ్య పాలను అందించే సత్తా కేవలం బీజేపీకే ఉందన్నారు. ఈసారి రాష్ట్రంలో మార్పు కోసం, అవినీతి రహిత పాలన కోసం ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.




