ATM: యూపీఐ రాకతో దేశంలో ఎన్ని ఏటీఎమ్లు మూతబడ్డాయో తెలుసా.? షాకింగ్ లెక్కలు
ATM: ఒకప్పుడు డబ్బులు అవసరమైతే ATM కోసం వెతికేవారు. షాపింగ్, ప్రయాణాలు, రోజువారీ ఖర్చుల కోసం ముందుగానే నగదు తీసుకుని జేబులో పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ATM: యూపీఐ రాకతో దేశంలో ఎన్ని ఏటీఎమ్లు మూతబడ్డాయో తెలుసా.? షాకింగ్ లెక్కలు!
ATM: చిన్న దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు దాదాపు అన్ని చోట్లా UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయగలుగుతున్నారు. దీంతో క్రమంగా ఏటీఎమ్లు కనుమరుగవుతున్నాయి.
UPI పెరగడంతో ATMల అవసరం తగ్గింది
ప్రస్తుతం చిన్న చిన్న ఖర్చులకు కూడా ప్రజలు UPIని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కూరగాయలు, కిరాణా సామగ్రి, హోటల్ బిల్లులు, ప్రయాణ ఖర్చులు ఇలా దాదాపు ప్రతి చెల్లింపునూ ఫోన్లోనే చేయగలుగుతున్నారు. దీంతో చేతిలో ఎక్కువ నగదు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
ATMల వద్ద కస్టమర్ల రాకపోకలు, నగదు లావాదేవీలు తగ్గుతున్న కొద్దీ ప్రతి ప్రాంతంలో ATMలను కొనసాగించడం బ్యాంకులకు కూడా అంత అవసరం లేకుండా పోతోంది. నిర్వహణ ఖర్చులు, నగదు నింపడం, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే తక్కువగా ఉపయోగించే ATMలను కొనసాగించడం బ్యాంకులకు భారంగా మారుతోంది. అందుకే కొత్త ATMలను ఏర్పాటు చేసే వేగం కూడా తగ్గుతోంది.
ప్రభుత్వ బ్యాంకుల ATMల వాటా పెరిగింది
ATM నెట్వర్క్ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల మధ్య కూడా మార్పులు కనిపిస్తున్నాయి. మార్చి 2024లో దేశంలోని మొత్తం ATM నెట్వర్క్లో ప్రభుత్వ బ్యాంకుల వాటా 61.56 శాతంగా ఉంది. మార్చి 2026 నాటికి అది 64.18 శాతానికి పెరిగింది.
అదే సమయంలో ప్రైవేట్ బ్యాంకుల వాటా 36.51 శాతం నుంచి 33.76 శాతానికి తగ్గింది. చిన్న బ్యాంకుల వాటా కొంత పెరిగినప్పటికీ.. మొత్తం ATM నెట్వర్క్లో వాటి సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. అంటే ATMల సంఖ్య తగ్గుతున్న సమయంలో ప్రభుత్వ బ్యాంకుల నెట్వర్క్ కొంత స్థిరంగా ఉండగా.. ప్రైవేట్ బ్యాంకుల వాటా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ATMల నుంచి నగదు లావాదేవీలు కూడా తగ్గాయి
ATMల సంఖ్య తగ్గడంతో పాటు వాటి వినియోగం కూడా తగ్గుతోంది. మార్చి 2024లో ATMలు, క్యాష్ రీసైక్లర్ మెషీన్ల ద్వారా సుమారు రూ.2.77 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. 2026 జూలై నాటికి ఈ మొత్తం రూ.2.20 లక్షల కోట్లకు తగ్గింది.
అంటే రెండేళ్లకు పైగా కాలంలో ATMల ద్వారా జరిగే నగదు లావాదేవీల విలువ 20 శాతానికి పైగా తగ్గింది. డెబిట్ కార్డు వినియోగంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మార్చి 2024లో డెబిట్ కార్డుల ద్వారా సుమారు రూ.3.21 లక్షల కోట్ల మేర ఖర్చు చేయగా.. 2026 జూలై నాటికి అది రూ.2.57 లక్షల కోట్లకు తగ్గింది.
మరోవైపు ఆన్లైన్ లావాదేవీలు మాత్రం భారీగా పెరిగాయి. ఈ మార్పు ప్రజలు నగదు, కార్డుల కంటే డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా వెళ్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
భవిష్యత్తులో ATMల పరిస్థితి ఎలా ఉంటుంది.?
UPI వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ATMల అవసరం మరింత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చాలా మంది నగదు లేకుండానే రోజువారీ చెల్లింపులు చేస్తున్నారు.
అయితే పూర్తిగా ATMలు కనుమరుగయ్యే పరిస్థితి మాత్రం ఇప్పట్లో ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, డిజిటల్ చెల్లింపులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నగదు అవసరం ఇంకా ఉంది. అందుకే బ్యాంకులు కూడా ప్రతి ప్రాంతంలో ATMలు ఏర్పాటు చేయడం కంటే.. అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మెషీన్లను కొనసాగించే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే UPI, డిజిటల్ చెల్లింపుల విస్తరణ భారతదేశ ప్రజల చెల్లింపు విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. దీని ప్రభావం ATMల సంఖ్య, డెబిట్ కార్డు వినియోగం, నగదు లావాదేవీలపై స్పష్టంగా కనిపిస్తోంది.




