Palakonda: కూటమి సర్కార్కు వైఎస్ఆర్సీపీ సవాల్.. రెండేళ్ల పాలనపై బహిరంగ చర్చ!
Palakonda: పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి ఆధ్వర్యంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' టౌన్ హాల్ సమావేశం.
Palakonda: కూటమి సర్కార్కు వైఎస్ఆర్సీపీ సవాల్.. రెండేళ్ల పాలనపై బహిరంగ చర్చ!
Palakonda: పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఏఎంజీ కన్వెన్షన్ హాల్ లో కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ పాలవలస విక్రాంత్ గారి ఆధ్వర్యంలో మాజీ శాసన సభ్యులు శ్రీమతి విశ్వాసరాయి కళావతి గారి అధ్యక్షత టౌన్ హాల్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా విక్రాంత్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని అన్నారు.ఎన్నికల సమయంలో ప్రకటించిన పలు హామీలు అమలుకు నోచుకోలేదని,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాలు,ప్రజా సమస్యలు,సంక్షేమ పథకాల అమలు పరిస్థితిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ప్రతిపక్షంగా వైయస్ఆర్సీపీ పనిచేస్తోందని, ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో చోటుచేసుకున్న అంశాలు,ప్రభుత్వ వైఫల్యాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు.హాల్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనలో ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై దాడులు కేసులు, మహిళలకు భద్రత కరువైనది, దివ్యాంగుల సంక్షేమం లేకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన మరియు నిరుద్యోగ భృతి కల్పించకపోవడం, డీఎస్సీ నిర్వహణలో అస్తవ్యస్తం మరియు అనర్హులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించడం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో చెల్లించకపోవడం, శాంతి భద్రత విషయంలో రెడ్ బుక్ పాలన అమలు చేయడం, పేదలకు ఇళ్ల స్థలాలను ఇంతవరకు మంజూరు చేయకపోవడం, కొత్త పెన్షన్లు ఇంత వరకు మంజూరు చేయకపోవడం వంటి అంశాలను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అని తెలిపారు.
మాజీ శాసన సభ్యులు కళావతి మాట్లాడుతూ వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీల ప్రాధాన్యతను వివరించారు. వైద్య విద్య, ప్రజా ఆరోగ్య రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేస్తూ, వాటి పరిరక్షణకు పార్టీ కట్టుబడి ఉందన్నారు. పెట్రోల్ డీజల్ ధరలు నియంత్రణ లేకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యంగా తెలిపారు.ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సంఘ నాయకులు, మేధావులు,పార్టీ శ్రేణులు,వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.




