Vaibhav Sooryavanshi: అందుకే వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ.. సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
East Zone Selectors React on Vaibhav Sooryavanshi Vice-Captaincy for Duleep Trophy 2026. వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల వయసులోనే ఈస్ట్ జోన్ సెలెక్టర్లు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
Vaibhav Sooryavanshi: అందుకే వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ.. సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల వయసులోనే ఈస్ట్ జోన్ సెలెక్టర్లు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. దులీప్ ట్రోఫీ 2026 కోసం ఇటీవల జట్టును ప్రకటించగా.. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్గా బుడ్డోడు ఎంపికయ్యాడు. ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద బాధ్యతలు అప్పగించడం భారత క్రికెట్లో పెద్ద చర్చకు దారితీసింది. రెడ్బాల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని ఆటగాడికి ఇంత కీలకమైన బాధ్యత ఎందుకు ఇచ్చారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఈస్ట్ జోన్ సెలెక్టర్ మనీష్ వర్ధన్ వెల్లడించాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైభవ్కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఆయన స్పష్టం చేశాడు.
ఓ జాతీయ మీడియాతో మనీష్ వర్ధన్ మాట్లాడుతూ... 'మేము కేవలం ప్రస్తుతాన్ని మాత్రమే ఆలోచించడం లేదు. భవిష్యత్తు గురించి కూడా దృష్టిలో పెట్టుకున్నాం. వైస్ కెప్టెన్గా ఉంటే కెప్టెన్ను దగ్గరగా పరిశీలించే అవకాశం ఉంటుంది. జట్టును ఎలా నడిపించాలి, ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలి వంటి విషయాలను నేర్చుకునే అవకాశం వైభవ్ సూర్యవంశీకి లభిస్తుంది. అతడు అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడు. క్రమంగా పరిపక్వత సాధిస్తున్నాడు. వైభవ్ అభివృద్ధి ప్రక్రియలో భాగంగానే ఈ బాధ్యతలు ఇచ్చాం' అని వివరించాడు.
మరో సెలెక్టర్ ప్రవాంజన్ ముల్లిక్ కూడా వైభవ్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్. అంతేకాదు వికెట్ కీపర్ కావడంతో మ్యాచ్లో ప్రతి దశలోనూ అతడు కీలక పాత్ర పోషిస్తాడు. అలాంటి నాయకుడి వద్ద ఉండటం ద్వారా వైభవ్ సూర్యవంశీ నాయకత్వ లక్షణాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. అతడిపై కెప్టెన్సీ భారం మోపకుండా నాయకత్వాన్ని అర్థం చేసుకునేలా చేయాలనేది మా ఆలోచన. భవిష్యత్తులో ఒక రోజు అతడు టీమిండియాకు కూడా కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వైస్ కెప్టెన్గా నియమించాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ప్రవాంజన్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో పాటు జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో రెండు అర్ధ సెంచరీలు సాధించిన వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే రెడ్బాల్ క్రికెట్లో మాత్రం బుడ్డోడికి పెద్దగా అనుభవం లేదు. ప్రస్తుతం అతడు నేర్చుకునే దశలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీ అతడి కెరీర్లో కీలక మలుపుగా మారే అవకాశముంది. బ్యాటర్గా మాత్రమే కాకుండా నాయకత్వ లక్షణాలను కూడా ప్రదర్శించే అవకాశం అతడికి లభించనుంది. దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్లో ఈస్ట్ జోన్ తన తొలి మ్యాచ్ను ఆగస్టు 23 నుంచి నార్త్ ఈస్ట్ జోన్తో ఆడనుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో వైభవ్ బ్యాటింగ్తో పాటు వైస్ కెప్టెన్గా ఎలా రాణిస్తాడన్నది చూడాలి.




