పరుగులకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తారో.. కోహ్లీ ఎప్పటికీ మాస్టరే.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Irfan Pathan backs Virat Kohli after India's ODI series loss to England. లార్డ్స్‌లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌పై మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Rishvik
Published on: 20 July 2026 6:32 PM IST
Virat Kohli
X

పరుగులకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తారో.. కోహ్లీ ఎప్పటికీ మాస్టరే.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli: ఆదివారం ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో టీమిండియా సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. ఈ వన్డేలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌పై మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. లార్డ్స్‌లో పరుగులు చేయడం కంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ గొప్పతనం ఎంతో పెద్దదని పేర్కొన్నాడు. లార్డ్స్‌లో హాఫ్ సెంచరీ చేయకపోయినా.. కోహ్లీ స్థాయి ఏమాత్రం తగ్గదని స్పష్టం చేశాడు. జియోస్టార్‌తో మాట్లాడుతూ ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'లార్డ్స్‌లో పరుగులు చేయడానికి బ్యాటర్లు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో నాకు ఇప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో, ప్రతి మైదానంలో పరుగుల వరద పారించాడు. లార్డ్స్‌లో పరుగులు చేయడం ప్రతిష్టాత్మకమే కావచ్చు. కానీ.. ఇక్కడ హాఫ్ సెంచరీ చేయకపోతే ప్రపంచ క్రికెట్‌లో లేదా భారత క్రికెట్‌లో అతని గొప్పతనం తగ్గిపోతుందా?, అస్సలు కాదు. భారత అభిమానుల దృష్టిలో కోహ్లీ ఎప్పటికీ ఒక మాస్టర్ బ్యాటర్. కింగ్ గతంలో మాస్టరే.. ఇప్పుడు మాస్టరే.. ఎప్పటికీ మాస్టరే' అని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు.

మూడో వన్డేలో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌లోని ప్రత్యేకతను కూడా ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు. 'విరాట్ కోహ్లీ 45 పరుగుల వద్దకు చేరుకున్న తర్వాత అవసరమైన రన్‌రేట్ పెరుగుతోందని అర్థం చేసుకున్నాడు. దానికి అనుగుణంగా తన బ్యాటింగ్ వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ పరిస్థితిని బాగా చదివి ఆడటం విరాట్ గొప్పతనం. కింగ్ ఇంకొంతసేపు క్రీజులో నిలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో' అని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.

388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ (138) అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. అనంతరం విరాట్ కోహ్లీ 74 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతూ రోహిత్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇద్దరూ క్రీజులో ఉన్నంతసేపు భారత్ విజయంపై అభిమానుల్లో ఆశలు కనిపించాయి. అయితే మ్యాచ్ చివరి దశలో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ ఓడిపోక తప్పలేదు. రోహిత్, కోహ్లీ వికెట్లు వరుసగా పడిపోవడంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా భారత్ 50 ఓవర్లలో 360కే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలతో మరోసారి విరాట్ కోహ్లీ స్థాయి, అతని అంతర్జాతీయ కెరీర్‌పై ఉన్న గౌరవం స్పష్టమైంది. ఒకే మైదానంలో చేసిన ప్రదర్శనతో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా నిలకడగా రాణించిన ప్రదర్శనలతోనే కోహ్లీ తన లెజెండ్ హోదాను సంపాదించుకున్నాడని పఠాన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికాడు. వన్డేలు మాత్రమే ఆడుతున్న కింగ్.. 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story