Sai Sudharsan: ఆర్సీబీతో జరిగే ఐపీఎల్ ఫైనల్‌కు గ్లూ తీసుకెళ్లాలి.. సాయి సుదర్శన్ కామెంట్స్ వైరల్!

Sai Sudharsan on Hit-Wicket Dismissals. రెండోసారి హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌కు చేరడంపై సాయి సుదర్శన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Rishvik
Published on: 30 May 2026 2:46 PM IST
Sai Sudharsan
X

Sai Sudharsan: ఆర్సీబీతో జరిగే ఐపీఎల్ ఫైనల్‌కు గ్లూ తీసుకెళ్లాలి.. సాయి సుదర్శన్ కామెంట్స్ వైరల్!

Sai Sudharsan: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుత విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని జీటీ కేవలం 18.4 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీ (104)తో చెలరేగగా, ఓపెనర్ సాయి సుదర్శన్ కీలక హాఫ్ సెంచరీ (58)తో జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఇక ఆదివారం అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఫైనల్‌లో గుజరాత్ తలపడనుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ అనంతరం మాట్లాడిన సుదర్శన్.. రెండోసారి హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌కు చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ అభిమానులను అలరించాడు.

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్‌-1లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై జాకబ్‌ డఫీ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ హిట్‌ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై అదే విధంగా అవుట్ అయ్యాడు. బ్రిజేశ్‌ శర్మ వేసిన 13వ ఓవర్లో డ్రైవ్‌ షాట్ ఆడిన సాయి.. నియంత్రణ కోల్పోయి బ్యాట్‌ను వదిలేశాడు. క్వాలిఫయర్‌-1లో బ్యాట్‌ నేల మీద పడిన తర్వాత స్టంప్స్‌ను తాకింది. క్వాలిఫయర్-2లో నేరుగా బ్యాట్ వికెట్ల మీదే పడింది. దాంతో సాయి తీవ్ర బాధతో క్రీజును వీడాడు. వరుసగా హిట్ వికెట్‌గా అవుట్ కావడంపై సాయి మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కు గ్లూ లేదా ఏదైనా ప్రత్యేక గ్రిప్ టెక్నాలజీ తీసుకెళ్లాల్సి వస్తుందేమోనని నవ్వుతూ అన్నాడు. 'ఇప్పుడు ఏదైనా గ్రిప్ టెక్నాలజీ ట్రై చేయాలి అనిపిస్తోంది. బ్యాట్‌ను బాగా పట్టుకుని కొన్ని బంతులు ఆడి చూడాలి. గత మ్యాచ్‌లో బంతి బౌన్స్ అయి స్టంప్స్‌ను తాకింది. ఈసారి మాత్రం నేరుగా షాట్ ఆడాలని అనుకున్నా, కానీ మళ్లీ అదే జరిగింది' అని చెప్పాడు.

శుభ్‌మన్ గిల్‌తో భాగస్వామ్యం గురించి సాయి సుదర్శన్ మాట్లాడుతూ.. తమ ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపాడు. 'మేము ప్రతి బంతిని బాదాలనే ఉద్దేశంతో బరిలోకి దిగాం. ముఖ్యంగా పవర్‌ప్లేలో మంచి ఆరంభం కావాలని భావించాం. మొదటి ఓవర్ల నుంచే దూకుడుగా ఆడటం వల్ల మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించగలిగాం. 215 పరుగుల లక్ష్యాన్ని చూసి భయపడలేదు. పెద్ద లక్ష్యం ఉందనే ఆలోచన చేయలేదు. పవర్‌ప్లేలో బాగా రన్స్ చేయాలనుకున్నాం. మ్యాచ్‌ను ఒక్కో బంతి చొప్పున ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైనే దృష్టి పెట్టాం. మా ప్రణాళికలపై మాకు పూర్తి స్పష్టత ఉండటం విజయానికి ప్రధాన కారణం' అని అన్నాడు.

శుభ్‌మన్ గిల్‌తో తన అద్భుత భాగస్వామ్యం గురించి సాయి మాట్లాడుతూ.. తాము ఇద్దరం పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటామని చెప్పాడు. 'ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలో మాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఈరోజు గిల్ అసాధారణంగా ఆడాడు. అతడు ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. అదే మా భాగస్వామ్య విజయానికి కారణం. గత కొన్ని సంవత్సరాల్లో నా బ్యాటింగ్ మెరుగుపడింది. గుజరాత్ టైటాన్స్‌తో తొలి సీజన్లలో ఆడిన అనుభవం నన్ను ఎంతో మెరుగుపరిచింది. మొదటి కొన్ని సంవత్సరాల్లో నాకు మంచి అనుభవం లభించింది. దాని వల్ల ఏ అంశాల్లో మెరుగుపడాలో తెలుసుకున్నాను. ఈ సీజన్‌లో కూడా ఇంకా చాలా విషయాల్లో అభివృద్ధి చెందాల్సి ఉంది. వాటిపై పని చేసి మరింత బలంగా తిరిగి వస్తాను' అని చెప్పాడు.

ఐపీఎల్ 2026 ఫైనల్ గురించి సాయి మాట్లాడుతూ.. జట్టు మొత్తం ఆనందంగా ఉన్నప్పటికీ, అదే సమయంలో ప్రశాంతంగా ఉండాలని భావిస్తున్నామని తెలిపాడు. 'ఫైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ గెలుపుతో ఆకాశంలో ఉన్న మేము.. త్వరగా నేల మీదికి రావాలి. మా పనిపై దృష్టి పెట్టాలి. ఫైనల్ అని భావించకుండా.. మరో మ్యాచ్‌లాగానే తీసుకుంటాం. అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయి' అని సాయి సుదర్శన్ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో గిల్-సుదర్శన్ జోడీ గుజరాత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో కూడా ఇదే జోడీ మరోసారి జట్టుకు విజయాన్ని అందిస్తుందా లేదో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story