MI vs KKR IPL 2026 : 14 ఏళ్ల శాపం నుంచి విముక్తి.. తొలి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ విక్టరీ

MI vs KKR IPL 2026 : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ గెలిచిన ముంబై, కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రికార్డు స్థాయిలో ఛేదించింది.

CR Reddy
Published on: 30 March 2026 6:39 AM IST
MI vs KKR IPL 2026
X

MI vs KKR IPL 2026 

MI vs KKR IPL 2026 : ముంబై ఇండియన్స్ అభిమానులకు ఇది పండగ లాంటి వార్త. ఏళ్ల తరబడి వేధిస్తున్న తొలి మ్యాచ్ గండం నుంచి ముంబై ఎట్టకేలకు బయటపడింది. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై అలవోకగా ఛేదించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించడమే కాకుండా 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.

మార్చి 29 ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (67) క్లాస్ ఇన్నింగ్స్ ఆడగా, కొత్త ఓపెనర్ ఫిన్ అలెన్ (37) మెరుపులు మెరిపించాడు. యువ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువంశీ (51) అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టు స్కోరును 200 దాటించాడు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీసి రాణించినప్పటికీ, మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, రాయన్ రికల్టన్ కనీవినీ ఎరుగని రీతిలో ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ (78) పాత రోజులను గుర్తు చేస్తూ కేకేఆర్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. మరోవైపు రాయన్ రికల్టన్ (81) కూడా సిక్సర్ల వర్షం కురిపించాడు. వీరిద్దరూ కలిసి కేవలం 11.5 ఓవర్లలోనే 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, రికల్టన్ 24 బంతుల్లో ఆ మైలురాయిని అందుకున్నాడు. వీరిద్దరూ సెంచరీలు మిస్ చేసుకున్నప్పటికీ, అప్పటికే మ్యాచ్ ముంబై వశమైపోయింది.

ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ రన్ ఛేజ్. గతంలో 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు ఉండగా, ఇప్పుడు 221 పరుగుల టార్గెట్‌ను 19.1 ఓవర్లలోనే పూర్తి చేసి ఆ రికార్డును తిరగరాసింది. అన్నింటికంటే ముఖ్యంగా, 2012 తర్వాత ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్లో తన మొదటి మ్యాచ్‌ను గెలవడం ఇదే తొలిసారి. గత 13 ఏళ్లుగా ముంబై తన ఓపెనింగ్ మ్యాచ్‌ను ఓడిపోతూ వచ్చేది. ఆ సెంటిమెంట్‌ను ఈసారి వాంఖడే సాక్షిగా బ్రేక్ చేసి, ముంబై పల్టన్ అభిమానులకు తీపి కబురు అందించింది.

ఓపెనర్లు పెవిలియన్ చేరిన తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. లక్ష్యం చేరువలో ఉన్నప్పుడు చిన్నపాటి తడబాటు కనిపించినా, ఆఖరి ఓవర్లో ముంబై విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ మధ్యలో కేకేఆర్ తరపున రింకూ సింగ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తానికి ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తన ప్రయాణాన్ని రికార్డుల విజయంతో మొదలుపెట్టి, మిగిలిన జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది.

CR Reddy

CR Reddy

Next Story