ఐపీఎల్ 2027 ముందే షాకింగ్ న్యూస్.. ఏకంగా 62 మంది ఆటగాళ్లపై వేటు.. లిస్ట్లో 18 కోట్ల ప్లేయర్?
IPL 2027: భారీ ధర, పేలవ ఫామ్, తరచూ గాయాల బారిన పడటం వంటి కారణాలతో ఏకంగా 62 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసేందుకు సిద్ధమయ్యాయి.
ఐపీఎల్ 2027 ముందే షాకింగ్ న్యూస్.. ఏకంగా 62 మంది ఆటగాళ్లపై వేటు.. లిస్ట్లో 18 కోట్ల ప్లేయర్?
IPL 2027: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిందో లేదో.. అప్పుడే అన్ని ఫ్రాంచైజీలు తదుపరి సీజన్ కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. లీగ్లో నిలదొక్కుకోవాలన్నా, కప్పు కొట్టాలన్నా జట్టులో పనికిరాని ఆటగాళ్లను వదిలించుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే భారీ ధర, పేలవ ఫామ్, తరచూ గాయాల బారిన పడటం వంటి కారణాలతో ఏకంగా 62 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలేసేందుకు సిద్ధమయ్యాయి.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ అవుట్? ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం!
ఐపీఎల్ 2027 వేలానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, రూ. 18 కోట్ల భారీ ధర పలుకుతున్న రుతురాజ్ గైక్వాడ్ను సిఎస్కె వదిలిపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ఫామ్ ప్రకారం అతడి ధర చాలా ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.
అలాగే ప్రశాంత్ వీర్ (రూ. 14.20 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. 5.20 కోట్లు) కూడా భారీ ధర కారణంగానే జట్టుకు దూరం కానున్నారు. ఇక పేలవ ప్రదర్శన కారణంగా డెవాల్డ్ బ్రెవిస్, మాథ్యూ షార్ట్, మాట్ హెన్రీలపై వేటు పడనుంది. నిరంతరం గాయాలతో సతమతమయ్యే జేమీ ఓవర్టన్ను కూడా వదిలించుకోవాలని యాజమాన్యం భావిస్తోంది.
ముంబై ఇండియన్స్: సూర్య, హార్దిక్, రోహిత్ల భవితవ్యంపై నీలినీడలు..
గత సీజన్లో ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్ తమ జట్టును పూర్తిగా మార్చేయాలని చూస్తోంది. పేలవమైన ఫామ్ కారణంగా సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డి కాక్, శార్దూల్ ఠాకూర్, రాబిన్ మింజ్ వంటి ఆటగాళ్లను నీతా అంబానీ విడుదల చేసే అవకాశం ఉంది.
మరోవైపు, భారీ ధర తీసుకుంటూ ఆశించిన స్థాయిలో రాణించని హార్దిక్ పాండ్యా (రూ. 16.35 కోట్లు), ట్రెంట్ బౌల్ట్ (రూ. 12.5 కోట్లు)లను కూడా వేలానికి వదిలేయాలని ముంబై భావిస్తోంది. కివీస్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ సగానికి పైగా సీజన్ గాయం కారణంగా ఆడకపోవడంతో అతడిని కూడా జట్టు నుంచి తప్పించనున్నారు.
సన్రైజర్స్ హైదరాబాద్: భారీ ధర పలికిన లివింగ్స్టోన్పై వేటు?
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) కూడా ముగ్గురు కీలక బౌలర్లు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ప్రఫుల్ హింగేలను వదిలిపెట్టనుంది. గత సీజన్లో వీరు భారీగా పరుగులు సమర్పించుకోవడమే దీనికి కారణం.
ఇక రూ. 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ను కూడా భారీ ధర కారణంగానే రిలీజ్ చేయనున్నారు. గాయాల కారణంగా ఇబ్బంది పడుతున్న కెప్టెన్ పాట్ కమిన్స్, బైడన్ క్రేస్, డేవిడ్ పేన్ వంటి విదేశీ ఆటగాళ్లను కూడా జట్టు నుంచి తప్పించేందుకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మొగ్గు చూపుతోంది.
ఇతర జట్ల పరిస్థితి ఏమిటి?
రాజస్థాన్ రాయల్స్: తులసి దేశ్పాండే, సందీప్ శర్మలతో పాటు భారీ ధర పలికిన షిమ్రాన్ హెట్మెయర్ (రూ. 11 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 7.20 కోట్లు)లను వదిలేయనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్: కరుణ్ నాయర్, సాహిల్ పరేఖ్లతో పాటు భారీ ధరకు కొనుగోలు చేసిన కుల్దీప్ యాదవ్ (రూ. 13.25 కోట్లు), టి నటరాజన్ (రూ. 10.75 కోట్లు), మిచెల్ స్టార్క్లను విడుదల చేయనుంది.
గుజరాత్ టైటాన్స్: షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, గ్లెన్ మాక్స్వెల్ వంటి హిట్టర్లతో పాటు రూ. 9.50 కోట్ల ప్రసిద్ధ్ కృష్ణను వదిలిపెట్టనుంది.
లక్నో సూపర్ జాయింట్స్: గత సీజన్లో 10వ స్థానంలో నిలిచిన లక్నో.. రిషభ్ పంత్ (రూ. 27 కోట్లు), నికోలస్ పూరన్ (రూ. 21 కోట్లు) వంటి అత్యంత ఖరీదైన ఆటగాళ్లను వేలానికి వదిలేయడం ఖాయంగా కనిపిస్తోంది.
పంజాబ్ కింగ్స్: మార్కస్ స్టోయినిస్ (రూ. 11 కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (రూ. 18 కోట్లు)లను భారీ ధర కారణంగా విడుదల చేయనుంది.
ఆర్సీబీ, కేకేఆర్: ఛాంపియన్ ఆర్సీబీ జితేష్ శర్మ (రూ. 11 కోట్లు)ను వదలాలని చూస్తుండగా, కేకేఆర్ జట్టు కెమెరాన్ గ్రీన్ (రూ. 25.20 కోట్లు), అజింక్యా రహానేలను విడుదల చేయనుంది.
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీలు తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎంతటి స్టార్ ఆటగాడైనా సరే.. ఫామ్ లేకపోయినా, ఫిట్నెస్ సరిగ్గా లేకపోయినా కోట్ల రూపాయల ధర వృథా అని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ భారీ విడుదల తర్వాత జరిగే వేలంలో ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడో చూడాలి.




