GT vs PBKS : హ్యాట్రిక్ కొట్టిన గిల్ సేన.. పంజాబ్ పై విజయంతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన గుజరాత్

GT vs PBKS : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. జేసన్ హోల్డర్ 4 వికెట్లతో చెలరేగగా, వాషింగ్టన్ సుందర్ సిక్సర్‌తో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్ రేసును రక్తికట్టించారు.

CR Reddy
Published on: 4 May 2026 5:48 AM IST
GT vs PBKS
X

GT vs PBKS

GT vs PBKS : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ కు చేరువవుతున్న వేళ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు గుజరాత్ చుక్కలు చూపించింది. జేసన్ హోల్డర్ అద్భుతమైన బౌలింగ్, వాషింగ్టన్ సుందర్ ఫినిషింగ్ టచ్‌తో గుజరాత్ ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. గుజరాత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తన మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి పంజాబ్ పతనాన్ని శాసించాడు. కేవలం 47 పరుగులకే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో సహా ఐదుగురు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఈ దశలో పంజాబ్ కనీసం 100 పరుగులు చేస్తుందా అన్న అనుమానం కలిగింది.

కష్టాల్లో ఉన్న జట్టును యువ ఆటగాడు సూర్యాంశ్ షెడ్గే, సీనియర్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ ఆదుకున్నారు. ముఖ్యంగా సూర్యాంశ్ కేవలం 23 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఒకే ఓవర్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పంజాబ్ కోలుకుంది. చివర్లో మార్కో యాన్సన్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ 165 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, సిరాజ్, రబాడ తలో రెండు వికెట్లు తీశారు.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు కూడా ఆరంభం అంత బాగా లేదు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. అయితే సాయి సుదర్శన్ మరియు జోస్ బట్లర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సుదర్శన్ ఈ సీజన్‌లో నాలుగోసారి హాఫ్ సెంచరీ (57) చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు. మధ్యలో పంజాబ్ బౌలర్లు అర్ష్‌దీప్, వైశాక్ వరుస వికెట్లు తీసి గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు.

చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్ ఉన్నారు. అర్షద్ ఖాన్ ఒక ఫోర్ కొట్టి టెన్షన్ తగ్గించగా, ఐదో బంతికి వాషింగ్టన్ సుందర్ (40 నాటౌట్) కళ్లు చెదిరే సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్ వరుసగా ఏడు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఇప్పుడు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో గుజరాత్ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story