IPL 2026 Best XI : ఐపీఎల్ బెస్ట్ టీమ్లో గిల్కు నో ఛాన్స్.. కింగ్ కోహ్లీ ఇన్.. మరి కెప్టెన్ ఎవరంటే ?
IPL 2026 Best XI : ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో ప్రకటించిన ఐపీఎల్ 2026 బెస్ట్ టీమ్లో 700 కి పైగా రన్స్ చేసిన శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదు. రజత్ పాటిదార్ను కెప్టెన్గా, కోహ్లీని ఓపెనర్గా ఎంపిక చేశారు.
IPL 2026 Best XI
IPL 2026 Best XI : ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో ఇక ఈ టోర్నమెంట్కు సంబంధించిన బెస్ట్ టీమ్స్ ఎంపిక ప్రక్రియ షురూ అయింది. ప్రముఖ అంతర్జాతీయ క్రికెట్ వెబ్సైట్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తాజాగా ఈ సీజన్కు సంబంధించి అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. అయితే ఈ టీమ్ ఎంపిక ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్లో పెను సంచలనంగా మారింది. ఈ టోర్నమెంట్లో ఏకంగా 700 కంటే ఎక్కువ పరుగులు చేసి టాప్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్లకు ఈ బెస్ట్ టీమ్లో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ క్రేజీ టీమ్లో ఎవరికి చోటు దక్కింది, కెప్టెన్ ఎవరు అనే పూర్తి వివరాలు చూద్దాం.
ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ 732 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 722 రన్స్ తో అదరగొట్టారు. ఇంతటి అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో ఎంపిక చేసిన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్లో వీరిద్దరికీ చోటు దక్కలేదు. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా వీరికి చోటు ఇవ్వకపోవడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ బెస్ట్ టీమ్లో కింగ్ విరాట్ కోహ్లీకి ఓపెనర్గా చోటు దక్కింది. కోహ్లీతో పాటు ఈ సీజన్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విన్నర్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని రెండో ఓపెనర్గా ఎంపిక చేశారు. వీరిద్దరి కాంబినేషన్ ఈ టీమ్కు గట్టి పునాది కానుంది.
ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. ఇషాన్ ఈ సీజన్లో 15 మ్యాచ్లలో 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 602 రన్స్ బాదాడు. అతనితో పాటు మిడిలార్డర్లో సన్రైజర్స్ కే చెందిన హెన్రిచ్ క్లాసెన్ను కూడా ఎంపిక చేశారు. క్లాసెన్ ఈ సీజన్లో 624 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికేసిన సంగతి తెలిసిందే. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తన బెస్ట్ ఐపీఎల్ టీమ్కు కెప్టెన్గా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ రజత్ పాటిదార్ను ఎంపిక చేసి అందరికీ షాక్ ఇచ్చింది. రజత్ పాటిదార్ కెప్టెన్సీలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన కెప్టెన్సీ రికార్డు వల్లే అతనికి ఈ బెస్ట్ ఎలెవన్ సారథ్య బాధ్యతలు అప్పగించారు.
జట్టులో ఆల్రౌండర్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. నితీష్ ఈ సీజన్లో 302 రన్స్ చేయడంతో పాటు 8 వికెట్లు కూడా పడగొట్టాడు. అలాగే లక్నో ప్లేయర్ కృణాల్ పాండ్యాను కూడా ఎంపిక చేశారు. కృణాల్ 37 యావరేజ్తో 226 రన్స్ చేయడమే కాకుండా 14 వికెట్లతో ఆల్రౌండ్ షో చూపించాడు. ఈ మోస్ట్ పవర్ఫుల్ టీమ్లో స్పెషలిస్ట్ స్పిన్నర్గా కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ నిలిచాడు. నరైన్ ఈ సీజన్ మొత్తంలో 6.6 బెస్ట్ ఎకానమీ రేటుతో బౌలింగ్ చేస్తూ 15 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు.
ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఈ సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్, 29 వికెట్లు తీసిన కగిసో రబడా మెయిన్ బౌలర్గా ఉన్నాడు. అతనితో పాటు 28 వికెట్లతో అదరగొట్టిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, 16 మ్యాచ్లలో 25 వికెట్లు పడగొట్టిన జోఫ్రా ఆర్చర్లను ఎంపిక చేశారు. అలాగే ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున ఎంట్రీ ఇచ్చి 15 వికెట్లు తీసిన యంగ్ పేసర్ సాకిబ్ హుస్సేన్కు కూడా ఈ జట్టులో అరుదైన అవకాశం దక్కింది. ఈ టీమ్లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించి, 12 మ్యాచ్ల్లోనే 19 వికెట్లు తీసిన రసిఖ్ సలామ్ డార్ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. తక్కువ మ్యాచ్ల్లోనే ఎక్కువ వికెట్లు తీసి ఆర్సీబీని ఛాంపియన్గా నిలబెట్టిన రసిఖ్కు చోటు ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.




