CSK vs PBKS Toss: టాస్ గెలిచిన పంజాబ్.. చెన్నై టీంలో కీలక మార్పు.. ఎవరొచ్చారంటే..?
Chennai Super Kings vs Punjab Kings: చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
CSK vs PBKS IPL 2026
Chennai Super Kings vs Punjab Kings: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నేడు క్రికెట్ అభిమానులకు అసలైన విందు కలగనుంది. చెన్నైలోని ప్రతిష్టాత్మక చేపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని చెన్నై భావిస్తుండగా, పంజాబ్ తన విజయ పరంపరను కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఈ ఏడవ లీగ్ మ్యాచ్ మొదలైంది. ఇప్పటికే స్టేడియం పసుపు రంగుతో నిండిపోగా, టాస్ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ చేయాలని డిసైడ్ చేసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ పోరులో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. రాజస్థాన్తో జరిగిన గత మ్యాచ్లో ఓటమి పాలైన చెన్నైకి ఈ విజయం అత్యంత కీలకంగా మారింది. మరోవైపు గుజరాత్పై అద్భుత విజయాన్ని అందుకున్న పంజాబ్ అదే జోష్లో కనిపిస్తోంది.
చెన్నైకి ఎదురుదెబ్బ: దూరమైన కీలక ఆటగాళ్లు..
చెన్నై అభిమానులకు ఈ మ్యాచ్లో ఒక చేదు వార్త ఎదురైంది. జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గాయం కారణంగా ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. తొడ కండరాల గాయం నుంచి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ధోనీతో పాటు యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ కూడా పక్కటెముకల నొప్పితో బాధపడుతూ జట్టుకు దూరమయ్యారు. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోవడం చెన్నై బ్యాటింగ్, వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్(కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
ముఖాముఖి పోరాటంలో పంజాబ్ దే పైచేయి..
గణాంకాలను పరిశీలిస్తే, ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ నువ్వా-నేనా అన్నట్లుగానే సాగుతుంది. ఇప్పటివరకు ఇరు జట్లు 33 సార్లు తలపడగా, చెన్నై 17 మ్యాచుల్లో, పంజాబ్ 15 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో పంజాబ్ విజేతగా నిలిచింది. అయితే, గత సీజన్లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ పంజాబ్ జట్టు చెన్నైని ఓడించడం గమనార్హం. ముఖ్యంగా చేపాక్ మైదానంలో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ పంజాబ్ విజయకేతనం ఎగురవేసి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
పిచ్ నివేదిక, రికార్డులు..
చేపాక్ స్టేడియం చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ ఇప్పటివరకు 91 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 51 సార్లు గెలవగా, ఛేజింగ్ చేసిన జట్లు 40 సార్లు విజయం సాధించాయి. సాధారణంగా ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని పేరున్నా, నేటి మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంటాయి.




