IPL 2026-BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ 2026 మధ్యలో నయా రూల్!

BCCI brings a new rule mid IPL 2026. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ సమయంలో బెంచ్‌లో ఉన్న ఆటగాళ్ల కదలికలను కట్టడి చేయడం, స్టేడియంలోకి అదనపు ప్లేయర్స్ వెళ్లకుండా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

Rishvik
Updated on: 9 April 2026 12:22 PM IST
IPL 2026-BCCI
X

IPL 2026-BCCI

IPL 2026-BCCI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మధ్యలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ సమయంలో బెంచ్‌లో ఉన్న ఆటగాళ్ల కదలికలను కట్టడి చేయడం, స్టేడియంలోకి అదనపు ప్లేయర్స్ వెళ్లకుండా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. బీసీసీఐ కొత్త రూల్ ప్రకారం.. జట్టులో ఎంపికైన 16 మంది ప్లేయర్లకు మాత్రమే మైదానంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. మిగతా ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి రావడం, డ్రింక్స్ తీసుకెళ్లడం, సందేశాలు ఇవ్వడం వంటి కార్యకలాపాలకు ఇకపై అనుమతి ఉండదు.

ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు మ్యాచ్ సమయంలో బెంచ్ ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు. మైదానంలోని బ్యాటర్లకు డ్రింక్స్ తీసుకెళ్లడం, బ్యాట్స్ అండ్ గ్లోవ్ ఇవ్వడం, కోచ్‌ల సూచనలు చేరవేయడం వంటి పనులు చేసేవారు. కానీ బీసీసీఐ తాజా నిబంధనల ప్రకారం.. టీమ్ యాజమాన్యం అందించిన 16 మంది ప్లేయర్స్ జాబితాలో లేని వారు మైదానంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. ఈ నిర్ణయం 10 జట్లకు ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ కొత్త రూల్స్ వెలుగులోకి వచ్చాయి. మ్యాచ్ సమయం వృథా కాకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం... ప్లేయింగ్ 11కి అదనంగా ఎంపికైన ఐదుగురు సబ్‌స్టిట్యూట్లు మాత్రమే మైదాన పరిసరాల్లో తిరగడానికి అనుమతి ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లు డగౌట్‌లోనే ఉండాలి. వారు బౌండరీ లైన్, ఎల్ఈడీ అడ్వర్టైజింగ్ బోర్డ్స్ మధ్య తిరగడానికి కూడా అనుమతి లేదు. దీంతో మ్యాచ్ సమయంలో జట్ల నిర్వహణలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ కొత్త నిబంధన మ్యాచ్ ప్లేయింగ్ కండిషన్స్ (ఎంపీసీ)లో ఇప్పటికే ఉన్న కొన్ని క్లాజ్‌లకు అదనంగా తీసుకురాబడింది. క్లాజ్ 11.5.2 ప్రకారం.. ఆటగాళ్లకు డ్రింక్స్ ఇవ్వడం కూడా నియంత్రణలో ఉంటుంది. కేవలం వికెట్ పడినప్పుడు లేదా బౌండరీ దగ్గర ఆటగాళ్లకు మాత్రమే డ్రింక్స్ ఇవ్వాలి. అంపైర్ల అనుమతి లేకుండా డ్రింక్స్ మైదానంలోకి తీసుకురావడం అనుమతించబడదు.

అలాగే క్లాజ్ 24.1.4 ప్రకారం.. మ్యాచ్‌లో ఆడని ఆటగాళ్లు మైదానంలో ఉంటే టీమ్ ట్రైనింగ్ బిబ్స్ తప్పక ధరించాలి. ఈ మార్పుల వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా.. మ్యాచ్ సమయంలో క్రమశిక్షణను పెంచడం, ఆటలో అనవసర అంతరాయాలను తగ్గించడం లక్ష్యంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ కొత్త రూల్ ఐపీఎల్ మ్యాచ్‌లలో ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story