Thirukannapuram Souriraja Perumal Temple: విభీషణుడి కోరికను నెరవేర్చిన రంగనాథుడు... అమావాస్యరోజు ఈ దృశ్యం చూసి తీరాల్సిందే

Thirukannapuram Souriraja Perumal Temple: భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోంది తమిళనాడులోని తిరుకన్నపురం సౌరిరాజ పెరుమాళ్ క్షేత్రం.

Balachander
Published on: 9 April 2026 1:22 PM IST
Thirukannapuram Souriraja Perumal Temple
X

Thirukannapuram Souriraja Perumal Temple

Thirukannapuram Souriraja Perumal Temple: భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, భూలోక వైకుంఠంగా విరాజిల్లుతోంది తమిళనాడులోని తిరుకన్నపురం సౌరిరాజ పెరుమాళ్ క్షేత్రం. శ్రీరంగంలో శేషతల్పంపై నిద్రిస్తున్న రంగనాథుని శాంత సుందర రూపాన్ని చూసి ముగ్ధుడైన విభీషణుడు, స్వామివారి నడకలోని సౌందర్యాన్ని చూడాలని అభిలషించాడట. రావణుడి సోదరుడైన ఆ పరమ భాగవతోత్తముని కోరిక మేరకు, అమావాస్య రోజున స్వామివారు తన గమన విలాసాన్ని ఇక్కడే ప్రదర్శించారని పురాణాలు చెబుతున్నాయి. నేటికీ ఆ అపురూప ఘట్టం ప్రతి అమావాస్య నాడు ఈ ఆలయంలో పునరావృతమవుతూ భక్తులను పులకింపజేస్తోంది.

మునయదరాయన్ భక్తి - పొంగల్ ప్రసాదం వెనుక కథ

ఈ క్షేత్రానికి సంబంధించి 'మునయదరాయన్' అనే భక్తుని కథ ఎంతో ప్రసిద్ధి. నాగపట్టణం ప్రాంతానికి చెందిన ఆయన, స్వామికి నైవేద్యం సమర్పించకుండా అడుగు కూడా బయట పెట్టేవారు కాదు. ఒకసారి పన్నులు చెల్లించలేదన్న నెపంతో రాజు ఆయన్ని జైలులో పెడతాడు. కానీ, పెరుమాళ్ స్వయంగా రాజు కలలో కనిపించి మునయదరాయన్‌ను విడుదల చేయిస్తారు. ఇంటికి వచ్చిన మునయదరాయన్‌ తన భార్యచేత పొంగల్‌ని తయారు చేయిస్తాడు. రాత్రి సమయం పైగా ఇంట్లో పూజావిధులు నిర్వహించలేని పరిస్థితి కావడంతో, అక్కడికి దగ్గరలో ఉన్న పెరుమాళ్‌కి నైవేద్యం సమర్పించాలని భావించి ఆలయానికి వెళ్తాడు. విచిత్రం ఏమంటే అప్పటికే ఆలయం తలుపులు మూసి ఉంటాయి. కానీ, మునయదరాయన్ మనసులోనే స్వామికి తలచుకొని నైవేద్యం సమర్పిస్తాడు. విచిత్రమేమిటంటే.. మరుసటి రోజు ఉదయం స్వామివారి పెదవులపై పొంగల్ ఆనవాళ్లు చూసి పూజారులు ఆశ్చర్యపోతారు. అప్పటి నుంచి నేటికీ ప్రతిరోజూ సాయంత్రం 2 కేజీల బియ్యం, 2 కేజీల ఆవునెయ్యితో చేసిన ప్రత్యేక పొంగల్‌ను స్వామికి నివేదించడం ఆచారంగా వస్తోంది.

అమావాస్య నాటి అద్భుత దృశ్యం

శ్రీరంగనాథుడు తన నడక సౌందర్యాన్ని విభీషణుడికి చూపించిన ఘట్టాన్ని స్మరిస్తూ, ప్రతి అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి విగ్రహాన్ని గర్భాలయం నుంచి విభీషణుడి సన్నిధి వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ ఉత్సవంలో స్వామివారి గమనం ఎంతో మనోహరంగా ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక ఏడాదికి ఒకసారి 'మాసిమాగం' వేళ, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరైకల్ సముద్ర తీరానికి స్వామివారిని తీసుకెళ్లి తీర్థవారి నిర్వహిస్తారు.

ఆలయ విశిష్టత - దర్శన మార్గం

కుంభకోణం నుంచి నాగపట్టణం వెళ్లే మార్గంలో ఉండే ఈ ఆలయం 7 అంచెల రాజగోపురంతో అత్యంత వైభోగంగా కనిపిస్తుంది. ఆలయానికి ఎదురుగా ఉండే 'నిత్య పుష్కరిణి' సరస్సులా విశాలంగా ఉండి ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడ స్వామివారు చేతిలో సుదర్శన చక్రంతో దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. భక్తికి, నడకలోని రాజసానికి నిలయమైన ఈ తిరుకన్నపురం క్షేత్రాన్ని దర్శిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story