Varahi Devi: గుప్త నవరాత్రులుః ప్రతికూల శక్తుల అడ్డంకులకు అమ్మవారు ఇచ్చిన పరిష్కారం ఇదే
గుప్తనవరాత్రుల్లో వారాహి దేవిని మూడో రోజు స్వప్న వారాహిగా ఆరాధిస్తారు. స్వప్న వారాహి దేవిని ఆరాధించడం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.
Varahi Devi: సనాతన దేవీ ఉపాసనలో ఆషాఢమాసంలో వచ్చే గుప్త నవరాత్రులకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. లలితా త్రిపురసుందరి సర్వసైన్యాధ్యక్షురాలైన శ్రీ వారాహి అమ్మవారిని ఈ రోజుల్లో నిష్ఠతో కొలిస్తే ఎలాంటి ప్రతికూల శక్తులైనా పటాపంచలు కావాల్సిందే. ఈ పవిత్ర నవరాత్రులలో అత్యంత రహస్యమైన, మహిమాన్వితమైన ఘట్టం మూడో రోజున పూజలందుకునే 'శ్రీ స్వప్న వారాహి' దేవి ఆరాధన. జీవితంలో ఎదురయ్యే పెద్ద పెద్ద అడ్డంకులు, మానసిక ఆందోళనల వల్ల రాత్రిళ్లు నిద్రపట్టక సతమతమయ్యే సామాన్య భక్తుల కోసం అమ్మవారు కలలోనే వచ్చి దిశానిర్దేశం చేసే పరమ అద్భుత పరిష్కారం ఈ తిథి పూజలోనే దాగుంది. ఈ రోజున గోమయంతో చేసే ప్రత్యేక పంచగవ్య దీపారాధన, అమ్మకు సమర్పించాల్సిన విశేష నైవేద్యం, నిద్రపోయే ముందు పఠించాల్సిన దివ్య మంత్ర రహస్యాలను తెలుసుకుందాం.
నెగెటివ్ ఎనర్జీని హరించే పంచగవ్య దీపం
స్వప్న వారాహి దేవి పూజలో దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మూడవ రోజున సాధారణ మట్టి ప్రమిదలు కాకుండా, ఆవు మూత్రం, గోమయంతో ప్రత్యేకంగా తయారు చేసిన 'పంచగవ్య ప్రమిదను' ఉపయోగించి దీపం వెలిగించాలి. సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం, గోమయంలో లక్ష్మీదేవి, గోమూత్రంలో గంగాదేవి కొలువై ఉంటారు. ఈ పంచగవ్య దీపాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల వాతావరణం పవిత్రం అవ్వడమే కాకుండా, నరదిష్టి, తాంత్రిక బాధలు, ఇంట్లో దాగిన సమస్త ప్రతికూల శక్తులు కర్పూరంలా కరిగిపోతాయి.
అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ... శత్రు నాశనం
శ్రీ వారాహి మాతకు నవరాత్రుల పూజలో సమర్పించే ప్రసాదాలలో అత్యున్నతమైనది, అమ్మకు ప్రీతికరమైనది 'మినప గారెలు'. నల్ల మినుములతో తయారు చేసిన గారెలను మూడవ రోజున స్వప్న వారాహికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రసాదాన్ని భక్తితో నివేదించడం వల్ల మన ప్రగతిని అడ్డుకునే శత్రువుల పీడ విరగడవుతుందని, వృత్తి ఉద్యోగాలలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి అఖండ విజయాలు సిద్ధిస్తాయని పండితులు స్పష్టం చేస్తున్నారు.
కలలోనే దారి చూపే స్వప్న వారాహి మంత్రం
జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సందిగ్ధంలో ఉన్నప్పుడు, లేదా పీడకలలతో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నప్పుడు స్వప్న వారాహి దేవిని ఆశ్రయించాలి. మూడవ రోజు రాత్రి పడుకునే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం కథయ కథయ స్వాహా అనే మంత్రాన్ని 11 సార్లు పఠించాలి. ఇలా చేయడం వలన ఆ జగన్మాత భక్తుల కలలోకి వచ్చి వారి సమస్యలకు స్పష్టమైన, సరైన పరిష్కారాన్ని, మార్గాన్ని చూపుతుందని అనాదిగా వస్తున్న నమ్మకం. ఆషాఢ గుప్త నవరాత్రుల వేళ ఈ సరళమైన, శక్తివంతమైన దైవిక విధానాన్ని ఆచరించి ఆ దండనాథా దేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం.




