Ramayanam: పూర్వీకులు చేసినట్టు రోజూ రామాయణం పారాయణ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మన ఇంట్లో పెద్దలు నిత్యం రామాయణాన్ని పారాయణం చేసేవారు. అందుకే ఆరోజుల్లో బాంధవ్యాలు బలంగా ఉండేవి. ప్రతిరోజూ తప్పకుండా రామాయణం పారాయణం చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
Ramayanam: మన పూర్వీకులు ప్రాతఃకాలంలోనే స్నానాదికాలు ముగించుకుని శ్రీమద్రామాయణాన్ని పారాయణ చేసేవారు. ప్రతిరోజూ రామాయణాన్ని చదవడం లేదా వినడం వల్ల మనిషి జీవితగమనం సంపూర్ణంగా మారుతుంది. ఇది కేవలం ఒక ఇతిహాసం కాదు, మానవ జన్మను తరింపజేసే ఆధ్యాత్మిక సాధనం. ఈరోజుల్లో కూడా ఇలా చేయడం వలన ఎన్నో మార్పులు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు.
నిత్య పారాయణ వల్ల కలిగే విశేష ప్రయోజనాలు
శ్రీరాముని దివ్య చరిత్రను నిత్యం ధ్యానించడం వల్ల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక తలాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. ప్రతిరోజు కనీసం ఒక సర్గ అయినా తప్పకుండా పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన జన్మజన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. చంచలమైన మనస్సు ప్రశాంతంగా, నిశ్చలంగా మారుతుంది. అంతేకాదు, కష్ట సమయాల్లో శ్రీరాముడు చూపిన ధైర్యం మనకు ప్రేరణగా నిలుస్తుంది. భయాన్ని పోగొట్టి, మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నూరురెట్లు పెంచుతుంది. దీంతో పాటు ఆధ్యాత్మిక గ్రంథాలను క్రమశిక్షణతో చదవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి పెరుగుతాయి. తద్వారా చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
గృహంలో దివ్య వాతావరణం ... సద్గుణాలు
రామాయణ పారాయణం జరిగే ఇంటిలో 24 గంటలూ సానుకూల శక్తులు ఆవరించి ఉంటాయి. ఏ పని తలపెట్టినా విఘ్నాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబంలో అప్పటి వరకు ఉన్న కలహాలు క్రమంగా నశించిపోతాయి. అన్యోన్యత పెరుగుతుంది. బాంధవ్యాలు బలపడతాయి. అంతేకాదు, రాముని పితృవాక్య పరిపాలన, లక్ష్మణుని సోదరభావం పిల్లలకు మంచి శీలాన్ని ఇస్తుంది. పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పుతాయి. సత్యం, ధర్మం ప్రకారం ఎలా జీవించాలో స్పష్టమైన మార్గదర్శనం లభిస్తుంది. ప్రతీరోజూ క్రమం తప్పకుండా ఐదు నుండి పది నిమిషాలపాటు శ్రీరామనామాన్ని జపిస్తూ రామాయణ పారాయణ చేయడం వలన ఆ శ్రీరామచంద్రుని అభయహస్తం, దివ్యానుగ్రహం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని పండితులు చెబుతున్నారు. పూర్వీకులు చేసిన విధంగా ఈరోజుల్లో మనం కూడా చేయడం వలన మానసిక శుద్ధి, గృహశుద్ధి కలుగుతాయి.




