అల్లూరి సీతారామరాజుకు అత్యంత ఇష్టమైన శివాలయం.. సాహసం చేస్తేనే చేరుకోగలం
Alluri Sitarama Raju Shiva Temple: భారత స్వతంత్య్ర సంగ్రామంలో తెల్లదొరలపై అలుపెరుగని పోరాటం చేసిన మన్యం వీరు అల్లూరి సీతారామరాజు.
అల్లూరి సీతారామరాజుకు అత్యంత ఇష్టమైన శివాలయం.. సాహసం చేస్తేనే చేరుకోగలం
Alluri Sitarama Raju Shiva Temple: భారత స్వతంత్య్ర సంగ్రామంలో తెల్లదొరలపై అలుపెరుగని పోరాటం చేసిన మన్యం వీరు అల్లూరి సీతారామరాజు. అల్లూరి ఎంత వీరుడో అంతకంటే భక్తిపరుడు. ప్రతిరోజు నిత్యం ఓ నిర్ణీత సమయానికి ఆయన ఓ శివాలయంలో స్వామివారికి స్వయంగా అభిషేకం చేసేవారట. అల్లూరి సీతారామరాజు నిత్యాభిషేకం చేసిన ఆ శివాలయాన్ని చేరుకోవాలంటే సాహసయాత్ర చేయాల్సిందే. అదే రంపచోడవరం శివాలయం. అల్లూరి అడుగుజాడలు పడిన ఈ నేల కేవలం ఒక చారిత్రక ప్రాంతమే కాదు, అంతుచిక్కని అద్భుతాలకు నెలవు కూడా.
12వ శతాబ్దపు శిలల విన్యాసం
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, రంప గ్రామంలో దట్టమైన అడవుల మధ్య కొలువైన ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినది. చోళుల కాలంలో నాగవంశీయులు నిర్మించిన ఈ అద్భుత కట్టడం చూస్తే అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి మనం ముచ్చటపడక తప్పదు. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి సిమెంటు, ఇటుకలు, ఇనుమును వాడలేదు. భారీగా ఉండే బండరాళ్లను ఒకదానిపై ఒకటి క్రమపద్దతిలో అమర్చి ఆలయాన్ని నిర్మించారు. ఇలా బండరాళ్లను అమర్చి ఆలయం నిర్మించడం చాలా కష్టమైన పని. అద్భుతంగా ఉండే ఈ ఆలయం వందల ఏళ్లు గడిచినా, ప్రకృతి వైపరిత్యాలు ఎదురైనా చెక్కుచెదరకుండా ఉన్నది.
అల్లూరి ఆరాధించిన స్వయంభూ లింగం
అల్లూరి సీతారామరాజు విప్లవ పోరాటం సమయంలో ఈ ప్రాంతంలో తలదాచుకోవడమే కాకుండా, ప్రతిరోజూ ఈ శివాలయంలో స్వయంభూ నాగశిలకు అభిషేకం చేసేవారట. భక్తితో శక్తిమేరకు మహాశివుడిని ఆరాధించేవారట. ఇక్కడి స్వయంభూ నాగశిలకు అభిషేకం చేయడం వలన మొండి సమస్యలు తొలగిపోయి, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ప్రకృతి ఒడిలో సాహస యాత్ర
ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి సాహసయాత్ర చేయాలి. ఒక్కసారి ఈ యాత్రను చేస్తే ఆధ్యాత్మికంగా జీవితంలో మార్పులు వస్తాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు చేరుకోవాలి. అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర దట్టమైన అడవిలో, రాళ్లు రప్పల మధ్య ప్రయాణించాలి. చుట్టూ జలపాతాల హోరు, అడవి జంతువుల అరుపుల మధ్య ఈ ప్రయాణం సాగుతుంది. ప్రకృతి ఒడిలో సాగే ఈ ప్రయాణం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.
అయితే, రంపచోడవరం శివాలయం చేరుకునే ప్రదేశం జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి శివాలయాన్ని చేరుకోవాలని అనుకునేవారు తమ వెంట ఆహారం, తాగునీరు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. స్వచ్చమైన ప్రకృతి ఒడిలో ఉన్న ఈ మన్యం మహాశివుడిని దర్శించుకోవడం ప్రతి భక్తుడికి ఒక మధురానుభూతి. చరిత్రను, ప్రకృతిని, దైవత్వాన్ని ఒకేచోట చూడాలనుకునేవారు తప్పక దర్శించాల్సిన క్షేత్రం ఇది. ఇక్కడికి చేరుకొని భక్తితో అభిషేకం చేసి, స్వామిని ఆరాధిస్తే తప్పకుండా జీవితంలో మార్పులు చోటుచేసుకుంటాయి.




