Viral Photos: ఇది చూశారా.. భానుడి భగభగలు.. వందల్లో గబ్బిలాలు ఖతం.!
భారతదేశంలో 2026 వేసవి కాలం సామాన్యులను మాత్రమే కాదు, మూగజీవాలను సైతం అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఊహించని
Bats
భారతదేశంలో 2026 వేసవి కాలం సామాన్యులను మాత్రమే కాదు, మూగజీవాలను సైతం అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుని పర్యావరణ అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్లున్న వాతావరణం కారణంగా వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. ఎలాంటి వ్యాధులు లేకపోయినా, వేటగాళ్ల ముప్పు లేకపోయినా.. కేవలం ఎండ దెబ్బకు, వేడి గాలులకు తట్టుకోలేక వివిధ జిల్లాల్లో ఇప్పటివరకు ఏకంగా 500కు పైగా గబ్బిలాలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
చెట్లపై నుండి రాలిపోతున్న గబ్బిలాలు
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లా సరోనా ప్రాంతంలో కనిపిస్తున్న దృశ్యాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా చెట్ల కొమ్మలపై వేలాడాల్సిన గబ్బిలాలు ఒక్కసారిగా కిందపడి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు విడుస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు కొర్బా జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే దాదాపు 200 గబ్బిలాలు చనిపోయి కనిపించాయి. మానవులలాగే గబ్బిలాలు కూడా వెచ్చని రక్తం కలిగిన క్షీరదాలు కావడంతో, అవి ఉష్ణోగ్రతల్లో వచ్చే తీవ్రమైన మార్పులను తట్టుకోలేవు. ఈ కఠినమైన వేసవిలో పగటిపూట శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి అవి పూర్తిగా చెట్ల నీడపైనే ఆధారపడతాయి. కానీ ఛత్తీస్గఢ్లో నీడ కూడా దొరకనంతగా ఎండలు ముదరడంతో, తీవ్రమైన డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం) భారినపడి ఇవి గుంపులు గుంపులుగా ప్రాణాలు కోల్పోతున్నాయని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.
నౌతపా సెగకు మాడిపోతున్న అడవి
ఈ మూగజీవాల మరణాలు కేవలం గబ్బిలాలకే పరిమితం కాలేదు, అంతకంటే పెద్ద ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. ఖైరాగఢ్ జిల్లాలోని దల్లీఖోలి-లచ్ఛనా అటవీ ప్రాంతంలో నెమళ్లు, పునుగు పిల్లులతో (పామ్ సివెట్స్) సహా 15కు పైగా అడవి జంతువులు, పక్షుల కళేబరాలు కనుగొనబడ్డాయి. అయితే ఈ వన్యప్రాణుల మరణాల సమయం మరింత ఆందోళన కలిగిస్తోంది. రోహిణి కార్తె ప్రవేశించిన తర్వాత మే నెల చివరి వారంలో వచ్చే తొమ్మిది రోజుల కాలాన్ని 'నౌతపా' (ఎండల తీవ్రత గరిష్టంగా ఉండే కాలం) అని పిలుస్తారు. భారతీయ క్యాలెండర్ ప్రకారం అత్యంత వేడిగా ఉండే ఈ రోజుల్లో ఛత్తీస్గఢ్ అడవులు నిప్పుల కొలిమిలా మారాయి. నీరు దొరక్క, వేడి గాలుల సెగకు తట్టుకోలేక అడవి పక్షులు ఆకాశంలో ఎగురుతూనే కిందపడిపోతున్నాయి.
భవిష్యత్తుకు ప్రమాద హెచ్చరిక
ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ సంఘటనలు కేవలం ఒక సీజన్ లో వచ్చే సాధారణ ఎండల వల్ల జరిగినవి కావని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏటా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారతీయ వేసవి కాలం మరింత క్రూరంగా మారుతోంది. ఎలాంటి ఆశ్రయం, ఉపశమనం లేని అడవి జీవులు ఈ వాతావరణ మార్పులకు భారీగా మూల్యం చెల్లించుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం ఎండలు ముదిరినప్పుడు ఇలా జంతువుల శవాలను చూడటం అలవాటుగా మారిపోకముందే, అడవుల్లో వాటి సంరక్షణకు , నీటి వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.




